Citizenship Bill: సువర్ణాక్షరాలతో లిఖించాలి.. పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు: మోడీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్కు వచ్చి నివాసం ఉన్న మైనార్టీలకు ఈ బిల్లు ద్వారా మన దేశ పౌరసత్వం కల్పించడం జరుగుతుంది.
citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్సభ ఆమోదం
రాజ్యసభలోకి బిల్లు
అయితే, ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లోని పలు విద్యార్థి సంఘాలు, నేతలు పెద్ద ఎత్తున బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరోవైపు రాజ్యసభలో ప్రవశపెడుతున్న పౌరసత్వ సవరణ బిల్లుకు సభ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ సంఖ్యా బలం కూడా ఇందుకు సానుకూలంగా ఉండటం గమనార్హం.
మోడీ కీలక వ్యాఖ్యలు
కాగా, రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు యొక్క ప్రాధాన్యతను ఆయన వివరించారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎంపీలందరికీ ఈ బిల్లు ప్రాధాన్యతను తెలియజేయాలని కోరారు.
బిల్లుపై పాకిస్థాన్ భాషలో ప్రతిపక్షాలు
పౌరసత్వ సవరణ బిల్లు అనేది సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని ప్రధాని వ్యాఖ్యానించారు. మతపరమైన వేధింపులకు, హింసకు గురై మన దేశానికి వచ్చిన మైనార్టీలైన ప్రజలకు ఈ బిల్లు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయని ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసక్తికరంగా మారిన బిల్లు ఆమోదం..
కాగా, సోమవారం లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్సభలో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలుండగా.. ఇందులో బీజేపీకి 83 స్థానాలున్నాయి. బీజేపీకి సానుకూలంగా ఉన్న జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పార్టీల మద్దతుతో తమ సంఖ్య 128కి చేరుతుందని కేంద్రం భావిస్తోంది. 112 కంటే ఎక్కువ ఓట్లు పడితే బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 31 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు ఈ బిల్లు ద్వారా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది.