ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్
Recommended Video
ఢిల్లీ : సంకల్ప్ పత్ర్ పేరుతో 48పేజీలతో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అది సంకల్ప్ పత్రం కాదని బూటకపు హామీల పత్రమని ఆరోపించాయి. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని బీజేపీ సర్కారు విపక్షాలను విమర్శించడాన్ని తప్పుబట్టాయి. ఈసారి ఎన్నికల్లో ప్రజలు బీజేపీని సాగనంపడం ఖాయమని అభిప్రాయపడ్డాయి.
బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి : గతంలో ఇచ్చిన హామీలే విస్మరించారని మాయావతి ఫైర్
ఉద్యోగం, ఉపాధి ప్రస్తావన లేదు
బూటకపు వాగ్దానాలతో బీజేపీ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగం, ఉపాధి అవకాశాల ఊసే ఎత్తకపోవడాన్ని తప్పుబట్టింది. 2014 మేనిఫెస్టోను కాపీ, పేస్ట్ చేసి ఈసారి కూడా అవే అంశాలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాలను బీజేపీ నేతలు ఎందుకు ప్రస్తావించలేదని, అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ మేనిఫెస్టోకు బదులు ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ విడుదల చేస్తే బాగుండేదని అన్నారు
ఎన్నికల జిమ్మిక్కు
బీజేపీ మేనిఫెస్టోను ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 2014లో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. పెద్దనోట్ల రద్దుపై మాట్లాడే ధైర్యం మోడీ - అమిత్ షాలకు లేదని విమర్శించారు. రైతాంగ సమస్యల పరిష్కారం, రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రజలు సాగనంపడం ఖాయం
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని సాగనంపడం ఖాయమని తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశ భవిష్యత్తు కోసం మోడీని ప్రధాని పీఠం నుంచే కాదు.. రాజకీయాల నుంచి తప్పించాల్సిన అవసరముందని దీదీ అభిప్రాయపడ్డారు.