ఆ హత్యలను ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే: రాజ్నాథ్ సింగ్
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్ల ఆధారంగా దేశంలో జరుగుతున్న హత్యలపై పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఒక వ్యక్తిని కొందరు కలిసి దాడి చేసి ఆపై చంపుతున్నారంటే అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనంటూ సమాధానం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వాలు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజ్నాథ్ సింగ్ సభలో తెలిపారు. రాజ్నాథ్ సింగ్ ప్రకటనతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి విపక్ష పార్టీలు. రాజ్నాథ్ ప్రకటనపై నిరసన తెలుపుతూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
"దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలను ఖండిస్తున్నాను. ఈ హత్యలు కేవలం పుకార్ల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి హత్యలపై స్థానిక ప్రభుత్వాలే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం"అంటూ రాజ్నాథ్ సింగ్ సభలో అన్నారు. ఇలాంటి పుకార్లతో కూడిన హత్యలు ఇప్పుడు జరుగుతున్నవి కాదని చెప్పిన హోంమంత్రి... అంతకు ముందు కూడా జరిగాయని గుర్తు చేశారు.
శాంతి భద్రతల విషయంలో కేంద్రప్రభుత్వానికి కొన్ని పరిధిలు ఉంటాయని చెప్పిన రాజ్నాథ్ సింగ్... ఈ తరహా హత్యలు నివారణకై తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్రం తరపున ఇద్దరు సలహాదారులను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు చెప్పారు. కేంద్రం ఇలాంటి విషయాలపై నోరుమెదపకుండా ఉండదన్న రాజ్నాథ్... జూలై మొదటివారంలోనే సలహాదారులను అప్పాయింట్ చేసిందని సభకు వివరించారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న పుకార్ల వల్లే జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలను ప్రచారంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా సోషల్ మీడియా ప్రొవైడర్లను ఆదేశించినట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఈ ఘటనలను దురదృష్టకరం అని చెప్పిన రాజ్నాథ్ సింగ్ రాష్ట్రప్రభుత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజ్నాథ్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష పార్టీలు నిరనస తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.