546 కరోనా పాజిటివ్ కేసుల వద్ద లాక్డౌన్...ఇప్పుడు 54 లక్షలు: మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ఫైర్
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఆదివారం లోక్సభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. కరోనావైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించాయి. లాక్ డౌన్ విధింపులో సరైన ప్రణాళిక లేకుండా విధించడం, కేసుల పెరుగుదల, వలసకార్మికుల వెతలతో పాటు ఆర్థిక వ్యవస్థ పతనంపై విపక్షాలు ప్రభుత్వంపై కన్నెర్ర చేశాయి. ప్రభుత్వం చాలా విధానాలను ఏకపక్షంగా అమలు చేసిందని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత శశి థరూర్. ప్రజాస్వామ్యంను మోడీ ప్రభుత్వం అవహేళన చేసిందని ధ్వజమెత్తారు.
చాలా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కట్టడి చేయడంలో సక్సెస్ సాధించాయని కానీ మోడీ ప్రభుత్వ పనితీరుతో భారత్లో కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు అయితే వైరస్ను కట్టడి చేశాయి లేదా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని అన్నారు. అయితే భారత్ మాత్రం రెండు జరగలేదని చెప్పారు. దేశంలో 564 కరోనావైరస్ కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ విధించడం జరిగిందని...ఇప్పుడు ఆ సంఖ్య 54 లక్షలకు చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్ష సభ్యులు. అదే సమయంలో జీడీపీ కూడా కుచించుకుపోయిందని అన్నారు. ఏదేమైనా దేశ ఆర్థిక వ్యవస్థ కృంగిపోతున్న సమయంలో సరిగ్గా కరోనావైరస్ మహమ్మారి ప్రభుత్వాన్ని కాపాడిందని ఎద్దేవా చేశారు. కరోనావైరస్ను సాకుగా చూపి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు విపక్ష పార్టీ సభ్యులు.
ఇదిలా ఉంటే శశిథరూర్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి అడ్డుకుని ప్రధాని మోడీ ఒంటరిగా ముందుండి కరోనాపై పోరును నడిపించారని చెప్పి శశిథరూర్ ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇక డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కూడా నిప్పులు చెరిగారు. మార్చి నెలలో వైరస్ పై గెలుపొందామని చెబుతూ దేశం మొత్తం క్యాండిల్స్ వెలిగించాలని ఒకసారి.. మళ్లీ హెల్త్ వర్కర్స్ కోసం చప్పట్లు కొట్టాలని మరోసారి చెప్పడాన్ని దయానిధి మారన్ ఎద్దేవా చేశారు.
Recommended Video
మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చడంపై కూడా మారన్ సభలో లేవనెత్తారు. ఇక రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ టీవీ ముందుకు వచ్చారంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఉంటుందని అన్నారు మారన్. లాక్డౌన్ హఠాత్తుగా విధించడంతో ఆయా రాష్ట్రాల పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంకు గురైందని అన్నారు. ప్రజలను చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు వెలిగించమన్నారు.. మరో మంత్రి అయితే గో కరోనా గో అని చెప్పి ఇంగ్లీషును ప్రమోట్ చేశారు కానీ కరోనాను మాత్రం పారదోలలేక పోయారని మారన్ సెటైర్లు వేశారు. ఎంపీల వేతనాల్లో కోత విధించడమంటే ప్రైవేట్ సంస్థలు కూడా తమ ఉద్యోగస్తులకు జీతాల్లో కోత విధించాలనే సంకేతాలు పంపినట్లు అవుతుందని మారన్ విమర్శించారు.