'తమిళ' హైటెన్షన్.. ఏం జరగబోతుంది?, పన్నీర్ విలీన సమావేశం వాయిదా!
తిరుగుబాటు చేస్తున్న 10మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన తర్వాతనే సమావేశం నిర్వహించాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు సమాచారం.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హైటెన్షన్ నెలకొంది. దినకరన్ బండారం బయటపడటంతో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. ఆయనతో పాటు అన్నాడీఎంకెలో శశికళ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ మేరకు ఆర్థికమంత్రి జయకుమార్ వీరిద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అర్థరాత్రి సమయంలో ప్రకటన చేశారు.
జయకుమార్ ప్రకటన అనంతరం అన్నాడీఎంకె వర్గంలోని 10మంది ఎమ్మెల్యేలు దినకరన్ ను కలిసి ఆయనకు మద్దతుగా నిలవడం గమనార్హం. వారంతా పళనిస్వామికి, పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. అన్నాడీఎంకె రాజకీయాల్లో అనిశ్చితి తారాస్థాయికి చేరింది. ఎట్టి పరిస్థితుల్లోను తాము వారికి మద్దతునిచ్చేది లేదని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు.
ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం వేగంగా పావులు కదుపుతోంది. బుధవారం ఉదయం 10గం.కు పార్టీ కార్యాలయంలో సమావేశం జరపాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు మీడియాకు కూడా సమావేశం అందించారు. విలీనంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఇంతలోనే పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. సమావేశం అర్థాంతరంగా రద్దయిపోయింది.
తిరుగుబాటు చేస్తున్న 10మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన తర్వాతనే సమావేశం నిర్వహించాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉదయం 10గం.కు జరగాల్సిన సమావేశం కాస్త మధ్యాహ్నాం 3గం.కు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మొత్తం పొలిటికల్ గేమ్ లో శశికళ చిత్తు చిత్తయిపోగా.. పన్నీర్ సెల్వందే పైచేయిగా నిలిచినట్లయింది.
జైలుకు వెళ్లేముందు మేనల్లుడు దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ శశికళ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడామె కొంపముంచింది. స్వయంకృతాపరాధంతో మొత్తం కథంతా తలకిందులైంది. జైలు నుంచి రాజకీయాలను శాసించడం సంగతి అటుంచితే.. ఇక తమిళనాట శశికళ ప్రాభవానికి పూర్తిగా తెరపడినట్లే కనిపిస్తోంది.