తమిళనాడు చరిత్రలో తొలిసారి: జెండా ఎగరవేయనున్న సీఎం
చెన్నై మెరీనా బీచ్లో జనవరి 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్కు బదులుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
చెన్నై: ఈసారి తమిళనాడుకు గణతంత్ర దినోత్సవానికి కొంత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. చెన్నై మెరీనా బీచ్లో జనవరి 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్కు బదులుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇక్కడ రిపబ్లిక్డేనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేయనుండటం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీహెచ్ విద్యాసాగరరావు తమిళనాడు రాష్ట్రానికి ఇంఛార్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనవరి 26న ముంబైలో జరిగే రిపబ్లిక్డే వేడుకల్లో పాల్గొని ఆయన పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ క్రమంలో రిపబ్లిక్ డే రోజున మెరీనా బీచ్లో జాతీయ పతాకావిష్కరణ చేయమంటూ స్థానిక రాజ్భవన్ కార్యాలయపు అధికారులు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు సమాచారం పంపారు.
తమిళనాడులో ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెయింట్ జార్జికోటపై ముఖ్యమంత్రి, మెరీనాబీచ్ గాంధీ విగ్రహం ప్రాంతం వద్ద జరిగే గణత్రంత వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీగా జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్రానికంటూ పూర్తిస్థాయి గవర్నరు లేకపోవడంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మెరీనాబీచ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.