మోడీతో భేటీ తర్వాత.. శశికళను కలిసిన పన్నీరు: ఎందుకు?
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం నాడు దివంగత జయలలిత నెచ్చెలి శశికళను కలిశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం నాడు దివంగత జయలలిత నెచ్చెలి శశికళను కలిశారు. పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం శశికళను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శశికళతో దాదాపు పదిహేను నిమిషాల పాటు పన్నీరు సెల్వం భేటీ అయ్యారు. ఐటీ దాడులు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు అంశం పైన వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
ఆ చర్చ జరిగిందా?
జయలలిత మృతి నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం వర్సెస్ శశికళగా పార్టీలో మారినట్లుగా ప్రచారం సాగుతోంది. పన్నీరు సెల్వం బీజేపీకి దగ్గరగా ఉన్నారనే వాదనలు ఉన్నాయి.
పన్నీరు వర్సెస్ శశికళ నేపథ్యంలో పార్టీ రెండుగా చీలుతున్న దిశలో కనిపిస్తోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శశికళను పన్నీరు సెల్వం కలవడం చర్చకు దారి తీస్తోంది. మోడీతో భేటీ అనంతరం.. రాజకీయాల పరిణామాల పైన శశికళతో చర్చించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
రామ్మోహన్ రావును అరెస్టు చేస్తారని ప్రచారం
ఐటీ దాడుల తర్వాత ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావును ఏ క్షణంలోనైనా అరెస్టు చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఐటీ దాడులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయన గుండెనొప్పితో పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో ఉన్నారు. ఒకవేళ అరెస్టు చేస్తే శని, ఆదివారం సెలవుల కారణంగా బెయిలు లభించదని భావించి ఆయన గుండెనొప్పి నాటకం ఆడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రయివేటు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని పలువురు నేతలు డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామ్మోహన రావును ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని ఆదివారం వార్తలు వచ్చాయి. ఆయనపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయని, ఆయన డిశ్చార్జి అయిన వెంటనే లేదా ఆసుపత్రిలోనే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తమిళ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి.