'వన్ ర్యాంక్-వన్ పెన్షన్కు కేంద్రం కట్టుబడి ఉంది'
న్యూఢిల్లీ: మాజీ సైనికుద్యోగుల కోసం 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' పథకాన్ని ప్రవేశపెడతామంటూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' పథకాన్ని అమలు చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అన్నారు.
వాటిని తొలగించి తొందరలోనే ఆ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' పథకం అమలు చేయాలంటూ మాజీ సైనికుద్యోగులు అందరూ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనే ప్రకటించాలని పట్టుబట్టడంతో పారికర్ పైవిధంగా స్పందించారు.
లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు: కేంద్రం
ఆర్థిక నేరారోపణలతో లండన్ పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి నోటీసులు జారీ చేస్తామని కేంద్రం తెలిపింది. లలిత్ మోడీని భారత్కు అప్పగించాలని బ్రిటన్ను కోరనున్నట్లు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు. లలిత్ మోడీ విదేశాలకు పారిపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
లలిత్ గేట్ వివాదంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. లండన్లో ఉన్న వ్యక్తిని నిజంగా వెనక్కి రప్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదన్నారు. ఫెమా కేసు మాత్రమే పెట్టి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
ఫెమా కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఎక్కువ శిక్ష కూడా పడదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీకి దమ్ముంటే లలిత్ మోడీని స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల అనంతరం సవాల్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది.