‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: గత 80 రోజులుగా ఆందోళన చేస్తున్న మాజీ సైనికులు విజయం సాధించారు. ఒకే ర్యాంకు-ఒకే పింఛను(వన్ ర్యాంకు వన్ పెన్షన్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశరక్షణలో సైనికుల సేవలు అసమానమైనవని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.
శనివారం ఢిల్లీలో ఒకే ర్యాంకు ఒకే ఫించనుపై ప్రకటన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే ర్యాంకు ఒకే ఫించన్ వ్యవహారం నాలుగు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం వద్ద నలుగుతోందని అన్నారు.
సైనికుల జీత భత్యాల కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించామని అన్నారు. ఒకే హోదా ఒకే ఫించన్ పథకం అమలు చేయడం వల్ల 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం కేంద్రంపై పడుతుందని ఆయన తెలిపారు.
ఒకే ర్యాంకు ఒకే ఫించను విధానం అమలు చేస్తే ఏడాదికి అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని గత ప్రభుత్వాలు పేర్కొన్నాయని ఆయన తెలిపారు. అది నిజం కాదని ఆయన వెల్లడించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఖర్చు చేసి ఆ భారం భరించేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
మేధావులతో చర్చ సందర్భంగా సైనికుల రిటైర్మెంట్ సాధారణ ఉద్యోగుల రిటైర్మింట్లా ఉండదని, అందరూ ఒకేలా రిటైర్ అవ్వరని, అందుకే ఒకే ర్యాంకు ఒకే ఫించన్ అసాధ్యమని అంతా అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. అయితే దేశ రక్షణకు ప్రాణాలొడ్డిన సైనికులకు ఆమాత్రం ప్రయోజనం కల్పించడం సరైన నిర్ణయమేనని భావించి కేంద్రం ఒకే ర్యాంకు ఒకే ఫించన్ పథకం అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
పథకంపై ఐదేళ్లకోసారి సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి పారికర్ తెలిపారు. 2014, జులై 1నుంచి ఉన్న బకాయిలు 4వారాల్లో చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనిక వితంతువులకు బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.
కాగా, రక్షణ మంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ సైనికులు ప్రకటించారు. అదే సమయంలో రక్షణ మంత్రి ప్రకటన స్పష్టంగా లేదని వారు తెలిపారు. సైనికులెవరూ ముందుగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావించరని, ప్రమోషన్ లభించిన వారంతా పై స్థాయిల్లో సౌకర్యాలు అనుభవిస్తారని, అదే సమయంలో వారితో సమానమైన సామర్థ్యం కలిగి, అవకాశం లభించని వారు మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటారని వారు పేర్కొన్నారు.
అలాంటప్పుడు వారితో పాటు సమానమైన పెన్షన్ సౌకర్యం పొందడం అసమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. అలాగే పాత బకాయిల విషయంలో రక్షణ మంత్రి ప్రకటన సరికాదని వారు అన్నారు. 2014 పెన్షన్ బకాయిలు నాలుగు దఫాలుగా చెల్లిస్తామనడం సరికాదని వారు పేర్కొన్నారు.