వెంటాడిన ‘ఆధార్’ పాపం: ఈ చిన్నారి ప్రతిరోజు పస్తులుంటోందట.. కథ తెలిస్తే కన్నీరే..!
భువనేశ్వర్ : ప్రతిదానికీ ఆధార్ కార్డు నెంబరు జతచేయడం తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం అది అమలవడం లేదు. రేషన్ కార్డుతో ఆధార్ లింక్ అవ్వలేదని ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందాల్సిన రేషన్ కూడా ఇవ్వడం లేదు. కేవలం రేషన్ కార్డుతో ఆధార్ సంఖ్య లింక్ చేయలేదని, అర్హులకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. తాజాగా ఒడిషాకు చెందిన సీమా ముండా అనే అనాథ బాలికకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఆధార్ సంఖ్య దానికి జతకాకపోవడంతో రేషన్ అందడం లేదు. దీంతో పస్తులు ఉంటోంది.
రెక్కడితే కానీ డొక్కాడదు
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న బాలిక పేరు సీమా ముండ. వయస్సు 11 ఏళ్లు. ఈమె అనాథ. ఒడిషాలోని కెందూజార్ జిల్లాలో ఉన్న సలారాపెంత గ్రామంలో నివాసం ఉంటోంది. బతకడం కోసం అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వచ్చిన డబ్బులతో పొట్టనింపుకుంటుంది. ఈ బాలికకు ఆధార్ కార్డు గురించి అవగాహన లేదు. దీంతో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతుంది. కట్టెలు అమ్మితేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. ఒకవేళ అనారోగ్యంపాలైతే పాపం ఆ చిన్నారి ఖాళీ కడుపుతో పడుకుంటుంది.
తాత మృతితో రెట్టింపు అయిన కష్టాలు
సీమా ముండా అనాథగా మారిన తర్వాత తన తాతయ్య దగ్గర ఉంటోంది. అతనే ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. ఆమెను బడికి పంపుతూ ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ ద్వారా కడుపు నింపుకునేవారు. తన తాతకు ఉన్న రేషన్ కార్డుపై నెలకు 10 కిలోల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చేవి.దీంతో కాస్త కష్టమైనప్పటికీ ఎలాగో అలాగా సర్దుకునేవారు.అయితే అప్పటికే ఉన్న కష్టాలు చాలవన్నట్లు సీమా తాతయ్య మృతితో అవి రెట్టింపు అయ్యాయి. ఇక ఆ తర్వాత సీమాకు కేవలం 5 కిలోల బియ్యం మాత్రమే వచ్చేవి. రేషన్ కార్డుతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలనే నిబంధన వచ్చాక అది కూడా ఆగిపోయింది.
ఆధార్ కార్డు లేదు అందుకే...
సీమా ముండాకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఆమె ఉంటున్న ఊర్లోని గ్రామపంచాయతీ కార్యాలయం రేషన్ నిలిపివేసింది. తను ఐదవ తరగతి వరకు చదువుకున్నట్లు సీమా చెబుతోంది. తన ఇంట్లో అంతా చనిపోయారని ప్రస్తుతం తాను ఒంటరి జీవితం గడుపుతున్నట్లు చెప్పింది 11 ఏళ్ల సీమా. ఆధార్ కార్డు లేదన్న నెపంతో తనకు రేషన్ ఇవ్వడం అధికారులు నిలిపివేశారని కన్నీరు మున్నీరైంది. ఆమె ఆవేదన విన్న వారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రోజూ కట్టెలు కొట్టి వాటిని అమ్మితే రూ.30 నుంచిరూ.40 వస్తున్నాయని దాంతోనే మూడుపూట్ల గడుపుతున్నట్లు సీమా చెప్పింది. వచ్చిన డబ్బుతో కొంత ఉప్పు, నూనె కొనేదని చెప్పింది. ఇక వర్షం పడ్డ రోజును తాను పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆధార్ అనుసంధానంపై చాలామందికి అవగాహన లేదు
ఇక్కడ మైనింగ్ ప్రాంతాల్లో నివాసముంటున్న చాలా మంది ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని స్థానిక సామాజిక కార్యకర్త సంజీబ్ సాహూ చెప్పారు. రేషన్ అందాలంటే కొత్తగా వచ్చిన నిబంధనలు ఇక్కడ ప్రజలకు తెలియవని చెప్పారు. ఆధార్తో అనుసంధానం కానీ రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ ఇవ్వడం ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే సీమా రేషన్ కోసం వచ్చినసమయంలో ఆమెకు ఆదార్ కార్డు లేదని అందుకే రేషన్ నిలిపివేసినట్లు గ్రామ సర్పంచ్ జబేశ్వరి మాజీ చెప్పారు. అయితే తన భాగంలోని రేషన్ను సీమాకు ఇచ్చినట్లు చెప్పిన సర్పంచ్.. ఆధార్ కార్డు అనుసంధానం అయితేనే ఈసారి రేషన్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను తాము ఉల్లంఘించలేమని చెప్పారు.
ఇలా ఒక్క సీమానే కాదు... చాలామందికి రేషన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలన్న నిబంధన తెలియక దానిపై పై అవగాహన లేక అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై ప్రభుత్వం పునఃపరిశీలించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.