డిప్యూటీ సీఎం ఓఎస్డీని అరెస్టు చేసిన సీబీఐ..లంచం తీసుకున్నందుకే..!
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఓఎస్డీగా ఉన్న అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మనీష్ సిసోడియా లంచం తీసుకున్న ఓఎస్డీపై కఠిన చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరారు. జీఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ లంచం తీసుకున్నారని ప్రస్తుతం తను అరెస్టయ్యాడని చెబుతూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విటర్లో పేర్కొన్నారు.
లంచం తీసుకున్న అధికారి తన కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో అవినీతి అధికారులను చాలామందిని తాను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు మనీష్ సిసోడియా ట్విటర్లో పేర్కొన్నారు. అవినీతి చేసేవారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను సహించదని చెప్పిన సిసోడియా.. ఆమ్ఆద్మీ పార్టీ పుట్టిందే సమాజంలోని అవినీతిని నిర్మూలించేందుకని చెప్పారు.
ఇదిలా ఉంటే సీబీఐ గురువారం రోజున ఓఎస్డీని అరెస్టు చేసింది. మొత్తం రూ. 2 లక్షలు అధికారి తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఇక లంచం తీసుకుంటూ అరెస్టయిన అధికారి గోపాల్కృష్ణ మాధవ్గా సీబీఐ పేర్కొంది. జీఎస్టీకి సంబంధించిన కేసులో రూ.2 లక్షలు తీసుకుంటుండగా ముందుస్తు సమాచారం ఉండటంతో రాత్రి సమయంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మాధవ్ను అరెస్టు చేసి రాత్రికి రాత్రే సీబీఐ హెడ్క్వార్టర్స్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పారు.
मुझे पता चला है कि सीबीआई ने एक GST इन्स्पेक्टर को रिश्वत लेते हुए गिरफ़्तार किया है. यह अधिकारी मेरे ऑफ़िस में बतौर OSD भी तैनात था. सीबीआई को उसे तुरंत सख़्त से सख़्त सजा दिलानी चाहिए. ऐसे कई भ्रष्टाचारी अधिकारी मैंने ख़ुद पिछले 5 साल में पकड़वाए है.
— Manish Sisodia (@msisodia) February 7, 2020
ఇక ఈ కేసుకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఒకప్పుడు జీఎస్టీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మాధవ్ 2015లో డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టారని వెల్లడించింది. అయితే ఢిల్లీ ఎన్నికలకు మరో రోజు సమయం మాత్రమే ఉండటంతో అరెస్టు జరగడం విశేషం. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారంకు తెరపడింది.