ఓటీటీ ప్లాట్ఫామ్స్కు కేంద్రం భారీ ఊరట- నో సెన్సార్, నో రిజిస్ట్రేషన్కు హామీ
ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉంచే కంటెంట్పై దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు సాధారణ ప్రజలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... పట్టించుకోని కేంద్రం ... తాజాగా వారికి ఊరటనిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర సమాచార ప్రసార శాఖ వారికి ఇచ్చిన హామీలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
దేశంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుపుతున్న సంస్ధలు కేంద్ర వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా ఓటీటీల ప్రతినిధులతో నిర్వహించిన భేటీలో క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు కేంద్రం మరో హామీ కూడా ఇచ్చింది. ఆయా ఓటీటీలు తమ కంటెంట్పై పర్యవేక్షణ కోసం నియమించే స్వయం నియంత్రణ విభాగాల్లోనూ కేంద్ర ప్రభుత్వ నామినీలు ఉండబోరని తేల్చిచెప్పేసింది. తద్వారా ఓటీటీల నియంత్రణలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని చెప్పినట్లయింది.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ విషయంలో పెట్టే సమాచారం తమకు అందిస్తే చాలని, ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ హామీ ఇచ్చినట్లు ఓటీటీ సంస్ధల ప్రతినిధులు తెలిపారు. అలాగే తాము రూపొందించే నిబంధనలు కూడా కంటెంట్ వర్గీకరించేందుకు ఉద్దేశించినవే కానీ సెన్సార్ కోసం కాదని వారికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఓటీటీల్లో కంటెంట్పై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం మాత్రం ప్రత్యేక వ్యవస్ధ ఏర్పాటు చేయాలని జవదేకర్ చెప్పారన్నారు.