మహారాష్ట్ర నెంబర్వన్ కావాలన్నదే లక్ష్యం, రైతులకు భారీ ఉపశమనం, తొలి క్యాబినెట్ సమావేశంలో ఉద్దవ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ చేపట్టిన కాసేపటికే ఉద్దవ్ థాకరే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కనీస ఉమ్మడి ప్రణాళిక.. ప్రజలకు అందాల్సిన పథకాలపై చర్చించారు. మంత్రివర్గ సమావేశంలో సహచర ఆరుగురు మంత్రులు పాల్గొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భార్య రష్మి, కుమారుడు ఆదిత్యతో కలిసి సిద్ది వినాయక ఆలయానికి ఉద్దవ్ థాకరే వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి నేరుగా మంత్రివర్గ సమావేశానికి విచ్చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సహచరులతో చర్చించారు.
పేద ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్దవ్ థాకరే భరోసానిచ్చారు. ఛత్రపతి శివాజీ స్థూపాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 20 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్నదాతల ప్రతీ చిన్న సమస్యను సునీశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశంలో మహారాష్ట్ర నెంబర్ వన్గా కావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వం కేటాయింపు పథకాలు ప్రజలకు అందాలే తప్ప ప్రకటనలు కాదని ఉద్దవ్ అన్నారు. రైతుల జేబుల్లో నగదు చేరాలని.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇక చాలన్నారు. రైతులకు సంబంధించి రెండురోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పారు. దీంతో వారికి భారీ ఉపశమనం కలుగుతుందని చెప్పారు. పంట రుణమాఫీ, పెట్టుబడి సాయంపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.