ఇది శాంపిల్ మాత్రమే.. హద్దు మీరితే అక్కడికే వచ్చి సత్తా చాటుతాం: గవర్నర్ సత్యపాల్ మాలిక్
శ్రీనగర్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి భారత్పైకి మరోసారి కాల్పులకు తెగబడిన నేపథ్యంలో ప్రతీకారచర్యల్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కొన్ని ఉగ్రశిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్... భారత సైన్యం సరిహద్దు రేఖ వెంబడి ఉన్న అన్ని ఉగ్రశిబిరాలను పూర్తిగా ధ్వంసం చేస్తుందని చెప్పారు. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకుంటే భారత జవాన్లు కచ్చితంగా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి ధ్వంసం చేసి వస్తారని చెప్పారు. ఆదివారం జరిగిన ప్రతీకార దాడుల్లో భారత్ ఆరుమంది పాక్ జవాన్లను పలువురు ఉగ్రవాదులను హతమార్చింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని కీరాన్, తంగ్ధార్, నౌగామ్ సెక్టార్లలో ఉగ్రవాదులు శిబిరాలను ఏర్పాటు చేశారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. చాలావరకు ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టామని అయితే ఈ దాడుల్లో ఇంకా కొందరు ఉగ్రవాదులు మృతి చెందారని చెప్పారు. వారి పూర్తి వివరాలను త్వరలో బయటపెడతామని బిపిన్ రావత్ చెప్పారు. మొత్తం మూడు ఉగ్రశిబిరాలు పూర్తిగా ధ్వంసం కాగా మరో ఉగ్రశిబిరం మాత్రం పాక్షికంగా ధ్వంసమైందని బిపిన్ రావత్ చెప్పారు.
#WATCH J&K Governor Satya Pal Malik on Indian Army using artillery guns to target terrorist camps in PoK: Terrorist camps ko hum bilkul barbaad kar denge,aur agar ye nahi baaz aaye to hum andar jayenge pic.twitter.com/rKII2nsbZ2
— ANI (@ANI) October 21, 2019
అక్టోబర్ 19 రాత్రి 20 మధ్యలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి భారత సరిహద్దులో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో మొహ్మద్ సిద్ధిఖీ అనే సామాన్య పౌరుడు మృతి చెందాడు. ఇక ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా అమరులయ్యారు. వీరిని హవల్దార్ పదం బహదూర్ శ్రేష్ట మరియు రైఫిల్ మ్యాన్ గమిల్ కుమార్ శ్రేష్టలుగా గుర్తించారు. అంతేకాదు జమ్మూకశ్మీర్లో జరిగే ప్రతి చర్యపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం అణిచివేతకు ప్రభుత్వం తమకు సర్వాధికారాలు కట్టబెట్టిందని బిపిన్ చెప్పుకొచ్చారు. మచిల్ సెక్టార్లో మూడు రోజుల క్రితం ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా వారికి అడ్డుకట్ట వేశామని బిపిన్ చెప్పారు.
పాకిస్తాన్కు జరిగిన నష్టంపై మాట్లాడటం లేదని.. భారత్ చేసిన నష్టం ఆ స్థాయిలో ఉందని బిపిన్ పేర్కొన్నారు. భారత్ పై కన్నెత్తి చూడాలంటూ పాక్ భయపడాలని అందుకే ఈ ప్రతీకార దాడులకు దిగినట్లు బిపిన్ రావత్ చెప్పారు. ఇక దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఆధారాలతో సహా బయటపెడుతామని చెప్పారు బిపిన్ రావత్.