ఒక్క అంగుళం కూడా చేజారనివ్వరు... దసరా వేళ ఇండియన్ ఆర్మీకి రాజ్నాథ్ ప్రశంసలు...
భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా సరిహద్దులో ఆర్మీ గస్తీ కాస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన భూభాగంలోకి ఇండియన్ ఆర్మీ ఎవరినీ అడుగుపెట్టనివ్వదని విశ్వాసం వ్యక్తం చేశారు.సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలకు తెరపడి శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోందన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం(అక్టోబర్ 25) డార్జిలింగ్లో ఏర్పాటు చేసిన త్రిశక్తి కార్ప్స్ సుక్నా వార్ మెమోరియల్ కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు.
Recommended Video
ఈ సందర్భంగా సైనికులతోనూ ముచ్చటించిన రాజ్నాథ్... వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రత పట్ల వారి అంకిత భావాన్ని అభినందించారు.'మీలాంటి ధైర్య సనికుల వల్లే ఈ దేశ సరిహద్దులు పరిరక్షించబడుతున్నాయి. మీ సేవలకు యావత్ దేశం గర్వపడుతోంది.' అని పేర్కొన్నారు. త్రిశక్తి కార్ప్స్ ఘనమైన చరిత్ర గురించి కూడా రాజ్నాథ్ మాట్లాడారు. 'త్రిశక్తి కార్ప్స్కు ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా 1962,1967,1971,1975లలో త్రిశక్తి కార్ప్స్ గొప్ప శౌర్యాన్ని ప్రదర్శించింది.' అని పేర్కొన్నారు.
అంతకుముందు రోజు శనివారం సుక్నా హెడ్ క్వార్టర్స్లో భారత ఆర్మీ యుద్ద సంసిద్దతపై రాజ్నాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సిక్కీం సెక్టార్లోని వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి గస్తీ కాసే 33 కార్ప్స్ కమాండర్స్కి ఇదే హెడ్ క్వార్టర్స్ కావడంతో అక్కడి పరిస్థితులపై సమీక్ష జరిపారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కీం,అరుణాచల్ సెక్టార్లలో దాదాపు 3500 కి.మీ వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించిన నేపథ్యంలో రాజ్నాథ్ దానిపై చర్చించారు. రాజ్నాథ్తో పాటు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఇందులో పాల్గొన్నారు.