అబ్ ఆప్ కీ బార్: పొత్తుల ద్వారాలు తెరిచే ఉన్నాయంటోన్న రాహుల్
న్యూఢిల్లీ: శతృవుకు శతృవు మిత్రుడవుతాడనే సామెతను రుజువు చేస్తున్నారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లో ఉమ్మడి శతృవు నరేంద్ర మోడీపై విజయం సాధించడానికి బీజేపీయేతర పార్టీలన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రయత్నాలు విఘాతం కలుగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలతో సమదూరాన్ని పాటిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
కాంగ్రెస్ తో పొత్తు వ్యవహారంలో ఆయన మెట్టు దిగట్లేదు. కాంగ్రెస్ కు రెండుకు మించి లోక్ సభ సీట్లను కేటాయించడానికి ఆయన ససేమిరా అంటున్నారు. తామిద్దరం కొట్టుకుంటే- మోడీ లాభపడుతారని, పోరు మాని పొత్తు కోసం మరోసారి భేటీ అవుదామంటూ రాహుల్ గాంధీ మరోసారి కేజ్రీవాల్ కు సంకేతాలను పంపించారు. అబ్ ఆప్ కీ బార్.. అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని పొత్తుల కోసం ఆహ్వానిస్తున్నారు.
తీపికబురు! ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఎల్ నినో బలహీనం!
ఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 నాటి ఎన్నికల్లో మొత్తం సీట్లను ఊడ్చేసింది బీజేపీ. ఒక్క సీటును కూడా వదలుకోకుండా, అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజృంభించింది. బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా కాదు.. కదా రెండంకెల స్థానాలను కూడా దక్కనీయకుండా చేసింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి దక్కింది కేవలం నాలుగు సీట్లే. అదే ప్రభంజనాన్ని లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగింపజేయడానికి కేజ్రీవాల్ కసరత్తు పూర్తి చేశారు. ఇందులో భాగంగా- కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఏడు లోక్ సభ స్థానాల్లో మూడింటిని తమకు ఇవ్వాలనేది కాంగ్రెస్ షరతు. దీనికి కేజ్రీవాల్ ఏ మాత్రం అంగీకరించట్లేదు. రెండే ఇస్తామంటూ భీష్మించుకుని కూర్చున్నారు. సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ పలుమార్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. అయినప్పటికీ.. సీట్ల సర్దుబాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభన వీడలేదు. తాము అయిదు స్థానాల్లో పోటీ చేస్తామని, రెండింటిని కేటాయిస్తామని కేజ్రీవాల్.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు షరతు పెట్టారు. దీనిపై కాంగ్రెస్ బేరమాడుతోంది. మరొక్క సీటు.. అంటూ కేజ్రీవాల్ ను ఊరిస్తోంది. ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు. దీనితో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు.
తాజాగా- రాహుల్ గాంధీ మరోసారి కేజ్రీవాల్ ను దువ్వే ప్రయత్నం చేశారు. నాలుగు స్థానాలను తాము ఆమ్ ఆద్మీ పార్టీకి వదులుకున్నామని, అయినప్పటికీ కేజ్రీవాల్ బెట్టు వీడట్లేదని ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ యూటర్న్ తీసుకుంటున్నారని చురకలు అంటించారు. పొత్తుల ద్వారాలు తెరిచే ఉన్నాయని, కాలయాపన చేయడానికి సమయం లేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తామిద్దరం కలిస్తే బీజేపీకి మార్గాలను మూసేయవచ్చని, వేర్వేరుగా పోటీ చేస్తే, బీజేపీ లబ్ది పొందుతుందని హితబోధ చేస్తున్నారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. కాగా, వచ్చే నెల 12వ తేదీన ఆరోదశ పోలింగ్ సందర్భంగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.