సత్యాన్ని పాతిపెట్టి.. సత్తాను అందుకున్న బీజేపీ: మా పోరాటం అధికారం కోసం కాదు..: ఉద్ధవ్, శరద్ పవార్..
ముంబై: తమ పోరాటం అధికారం కోసం కాదని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికేనని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. సత్యమేవ జయతే అనే నినాదంతో తాము అసత్యంపై పోరాటాన్ని ప్రారంభించామని చెప్పారు. సత్యం వైపున నిల్చున్న తామే ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వద్ద శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ శాసన సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
We are 162: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరేడ్: హేమాహేమీలతో కిటకిటలాడుతున్న హోటల్.. !
ఇదే హోటల్ వద్ద ఈ మూడు పార్టీల శాసన సభ్యులు పరేడ్ ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పరేడ్ ఆరంభానికి ముందు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడారు. ఎమ్మెల్యేల్లో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. బీజేపీ-అజిత్ పవార్ వర్గం నాయకులు అప్రజాస్వామ్య బద్ధంగా అధికారాన్ని అందుకున్నారని ఉద్ధవ్, శరద్ పవార్ మండి పడ్దారు. అప్రజాస్వామ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
సత్యాన్ని పాతిపెట్టి, సత్తాను అందుకుందని విమర్శించారు. అలాంటి వారిపై ప్రస్తుతం తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ.. బీజేపీ-అజిత్ పవార్ అధికారం కోసం అర్రులు చాశారని ధ్వజమెత్తారు. అలాంటి వారికి ప్రజాస్వామ్యమే శిక్షించాల్సిన సమయం ఆసన్నమైనదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన సంఖ్యాబలం కంటే తమ వద్ద అధిక సభ్యులు ఉన్నారని చెప్పారు.
అప్రజాస్వామికంగా గద్దెనెక్కిన బీజేపీ-అజిత్ పవార్ సంకీర్ణ ప్రభుత్వం కూలుతుందని అన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని, తమ మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. 145 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే విషయాన్ని తెలిసి కూడా బీజేపీ నాయకులు బరితెగించారని విమర్శించారు. 105 మందితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారని వారు నిలదీశారు.
30 సంవత్సరాలుగా కలిసి ఉన్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ తమను మోసగించిందని ఉద్ధవ్ థాకరే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే దుగ్ధ బీజేపీ నాయకుల్లో ఉందని విమర్శించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తమను వెలివేసినట్లు వ్యవహరించారని చెప్పారు. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలంటూ తాము చేసిన ప్రతపాదనలను అధికార దుగ్ధతోనే తిరస్కరించారని నిప్పులు చెరిగారు.