సీఎం, డీజీపీ రాజీనామా చేయాలి, ప్రాణాలు పోతున్నా చర్యలు తీసుకోరా?: స్టాలిన్
చెన్నై: తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై కాల్పులు జరపడాన్ని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తప్పు పట్టారు. పోలీసుల కాల్పుల్లో 13మంది మృతి చెందిన ఘటనకు నిరసనగా తమిళనాడు సచివాలయం ముందు ఆయన ఆందోళనకు దిగారు.
స్టాలిన్ తో పాటు డీఎంకె నేతలు, మరికొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకు అడ్డుపడ్డారు. స్టాలిన్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే స్టాలిన్ ను తరలిస్తున్న క్రమంలో ఆయన మద్దతుదారులు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులకు, స్టాలిన్ మద్దతుదారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
'నటించింది చాలు.. ఇక లేచి వెళ్లు': స్టెరిలైట్ వివాదం, పోలీసుల అమానుష వైఖరి!
ఆందోళన సందర్భంగా స్టాలిన్ పళనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 'అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. నిందితులపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.' అని అన్నారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి, డీజీపీ రాజేంద్రన్ తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ట్విట్టర్ లోనూ ఈ విషయంపై స్పందించారు స్టాలిన్. 'తూత్తుకుడి మారణకాండపై మా ప్రశ్నలకు పళనిస్వామి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. తూత్తుకుడి బాధితుల గోడు మేము విన్నాం. పళనిస్వామి అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. సీఎం, డీజీపీ రాజీనామా చేసేదాకా మా పోరాటాన్ని ఆపేది లేదు' అని స్టాలిన్ స్పష్టం చేశారు.
కాగా, స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు కొనసాగిస్తున్న ఆందోళన మంగళవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. ఘటనపై ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది.
స్టాలిన్ ఆందోళనపై పళనిస్వామి స్పందన:
స్టెరిలైట్ ఘటనపై సీఎంతో చర్చించడానికి అపాయింట్ మెంట్ దొరకకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్న స్టాలిన్ వ్యాఖ్యలను సీఎం పళనిస్వామి తోసిపుచ్చారు. తాను స్టాలిన్ తో మాట్లాడటానికి ఒప్పుకోలేదన్న దానిలో నిజం లేదని, అసలు స్టాలిన్ తన అపాయింట్ మెంటే కోరలేదని ఆయన స్పష్టం చేశారు.