‘నోటివెంట మాట రాలేదు! కాశ్మీరీలు సిగ్గుతో తలదించుకోవాలి’
అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. అంతేగాక, ఈ ఘటనతో ప్రతీ కాశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అనంత్ నాగ్ లో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతి
ఉగ్రవాదుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యాత్రికులను సీఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతీ సంవత్సరం అనేకమంది కాశ్మీర్కు వస్తున్నారని చెప్పారు.
అయితే, ఈసారి ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ఘటనపై సమాచారం అందగానే తనకు నోటి వెంట మాటరాలేదని అన్నారు ముఫ్తీ. దాడికి పాల్పడిన వారిని పోలీసులు త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకముందని తెలిపారు.
జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు మరణించగా, 11మంది గాయపడ్డారు.