జేఎన్యూలో వివేకానంద విగ్రహం... ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. భావజాలంపై కీలక వ్యాఖ్యలు...
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ) ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గురువారం(నవంబర్ 12) సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'బలమైన,సంపన్నమైన దేశంగా భారత్ ఎదగాలని స్వామిజీ కన్న కలలను సాకారం చేయడానికి ఈ విగ్రహం నిరంతర స్పూర్తినిస్తుంది. ఈ విగ్రహం యువత నేతృత్వంలోని అభివృద్ధి దృష్టితో ముందుకు సాగడానికి దేశాన్ని ప్రేరేపిస్తుంది.' అని పేర్కొన్నారు.
ఏకత్వం వైపు నడిపించే ప్రేరణ...
స్వామి వివేకానంద విగ్రహం ప్రతీ ఒక్కరికీ దేశం పట్ల కరుణ,ప్రేమను నేర్పుతుందని మోదీ అన్నారు. స్వామిజీ తన జీవితంలో ఇచ్చిన బలమైన సందేశం ఇదేనన్నారు. ఈ విగ్రహం స్వామిజీ ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచిన ఏకత్వం వైపు భారత్ను నడిపిస్తుందని.. ప్రతీ ఒక్కరిలో శక్తిని నింపుతుందని అన్నారు. ప్రతీ వ్యక్తిలో ధైర్యాన్ని చూడాలన్న స్వామిజీ కలలకు ఈ విగ్రహం దోహదపడుతుందన్నారు.
ఆ ధోరణి సరికాదు...
జాతీయ ప్రయోజనాలను మించి మన భావజాలానికి ప్రాధాన్యమివ్వడం దేశానికి హాని కలిగిస్తుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా.. నా భావజాలం ఇదే చెబుతోంది... ఇదే పద్దతిలో దేశ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాను,ఇదే పద్దతిలో పనిచేస్తాను అని చెప్పడం సరికాదన్నారు. మన భావజాలం జాతీయ ప్రయోజనాల విషయంలో దేశానికి మద్దతునివ్వాలి తప్ప వ్యతిరేకించకూడదన్నారు. ప్రస్తుతం భారత్ స్వయం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందన్నారు.
వ్యతిరేకిస్తోన్న విద్యార్థి
మరోవైపు ప్రధాని మోదీ కార్యక్రమాన్ని నిరసిస్తూ జేఎన్యూ విద్యార్థి సంఘం సాయంత్రం 5గంటలకు నార్త్ గేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. మోదీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక,విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకు పిలుపునిచ్చింది. విగ్రహావిష్కరణ అనేది కేవలం నిధుల దుర్వినియోగమేనని విద్యార్థి సంఘం ఆరోపించింది.విగ్రహాలకు పెట్టే ఖర్చు విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించేందుకు వినియోగిస్తే బాగుంటుదని పేర్కొంది.