ఆ కుటుంబానికి ఇది అత్యంత క్లిష్ట సమయం.. అండగా నిలుద్దాం: అతని రాక కోసం ప్రార్థిద్దాం: ఒవైసీ
హైదరాబాద్: భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళ ఎయిర్ క్రాఫ్ట్ లను వెనక్కి తరిమేసే క్రమంలో అదృశ్యమైన భారత వాయుసేనకు చెందిన పైలెట్ అదృశ్యమైన ఘటనపై సర్వాత్రా సానుభూతి వ్యక్తమౌతోంది. పైలెట్ అదృశ్యమైన ఘటనపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
పైలెట్ కుటుంబ సభ్యులకు ఇది అత్యంత క్లిష్ట సమయం అని వ్యాఖ్యానించారు. అదృశ్యమైన పైలెట్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు. పైలెట్ అత్యంత ధైర్యవంతుడని కీర్తించారు. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ ఓ ప్రకటన విడుదల చేశారు. జెనీవా కన్వెన్షన్ ఆర్టికల్ 3ని పాకిస్తాన్ గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రతి దేశం కూడా యుద్ధ ఖైదీలను మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో భేషజాలకు వెళ్లకూడదని అన్నారు. యుద్ధ ఖైదీలపై ఆగ్రహావేశాలను ప్రదర్శించకూడదని అన్నారు. పైలెట్ అదృశ్యమైన ఘటనలో పాకిస్తాన్ జెనీవా కన్వెన్షన్ ఆర్టికల్ 3కి లోబడి వ్యవహరించాలని, ఇది ఆ దేశ చిత్తశుద్ధిని పరీక్షించే సమయం అని అసద్ చెప్పారు.
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ సమీపంలో ఉన్న జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులను అసదుద్దీన్ సమర్థించారు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఆయన దీన్ని అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఒవైసీ చెప్పారు.