సురక్ష చక్ర దాటొద్దు: పండుగలొస్తున్నాయ్.. బీ అలర్ట్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ నదీ దినోత్సవం గురించి మోడీ ప్రస్తావించారు. నదులు ప్రపంచానికి నడకలను నేర్పాయని అన్నారు. ప్రజల జీవితంలో ఓ నదులు ఓ ముఖ్య భాగం అయ్యాయని పేర్కొన్నారు. నదిని తల్లితో పోల్చుకుంటామని గుర్తు చేశారు. ఓ తల్లి తన బిడ్డలను పోషించినట్టుగా నదులు కూడా ప్రాణికోటిని పెంచిపోషిస్తున్నాయని చెప్పారు.
నదుల ప్రాధాన్యత గురించి..
గంగేచ.. చమునేచ శ్లోకాన్ని ప్రధాని వినిపించారు. ప్రతి వ్యక్తితో నదులకు ఆత్మీయ అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. జల కాలుష్యం కూడా పాపంగా భావిస్తుంటామని మోడీ పేర్కొన్నారు. నదులను కాలుష్య కోరల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో నదులను కేంద్రబిందువగా చేసుకుని పండుగలను జరుపుకొంటారని గుర్తు చేశారు. నమామి గంగే మిషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
నమామి గంగే మిషన్
నదులను కాలుష్యం బారి నుంచి కాపాడటానికి యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నదులను పునరుజ్జవింపజేయడానికి కోట్లాదిమంది ప్రజలు దశాబ్దాల కాలంగా స్వచ్ఛందంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. నదులు, నదీ తీర ప్రాంతాలను పరిశుభ్రమంగా ఉంచడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయని అన్నారు. తమిళనాడులో రూపాన్ని కోల్పోయిన నాగా నదిని స్థానికులు పునరుజ్జీవింపజేసుకున్నారని చెప్పారు.
ప్రతి సంవత్సరం నెలరోజుల పాటు నదీ ఉత్సవాలు..
గుజరాత్లో సబర్మతి నది కొన్ని దశాబ్దాలుగా జల ప్రవాహానికి నోచుకోలేదని, ఇప్పుడు నర్మదతో దాన్ని అనుసంధానించడం వల్ల పూర్వవైభవాన్ని సంతరించుకుందని మోడీ చెప్పారు. ప్రతి రాష్ట్రం కూడా ప్రతి సంవత్సరం నదీ ఉత్సవాలను జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వచ్ఛతను పాటించడంతోనే జాతిపిత మహాత్మాగాంధీకి ఇచ్చిన నిజమైన నివాళిగా మోడీ చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ఎన్నో సంవత్సరాల కిందటే మహాత్ముడు గుర్తు చేశారని, ఓ అలవాటుగా మార్చారని అన్నారు.
జన్ధన్ ఖాతాలతో..
జన్ధన్ ఖాతాల వల్ల అవినీతికి అడ్డుకట్ట పడిందని మోడీ అన్నారు. జన్ధన్ ఖాతాల వల్ల కోట్లాదిమంది ప్రజలు బ్యాంకులతో అనుసంధానం అయ్యారని చెప్పారు. యూపీఐ వల్ల వేల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నాయని, దీనివల్ల ఖజానాకు ఆదాయం అందుతోందని పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. బ్యాంకింగ్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయడంలో సాంకేతికత సహకరిస్తోందని అన్నారు.
వ్యాక్సినేషన్లో ఆదర్శం..
కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని మోడీ చెప్పారు. సొంతంగా, దేశీయ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేశామని అన్నారు. కోట్లాదిమంది దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఓ మహోద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. తక్కువ సమయంలో కోట్లాదిమందికి వ్యాక్సిన్లను ఉచితంగా అందించామని మోడీ చెప్పారు.
పండగ సీజన్లో అలర్ట్..
కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినంత మాత్రాన, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినంత మాత్రాన ఈ మహమ్మారిపై పోరాటం ముగిసినట్టు కాదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరు కరోనా ప్రొటోకాల్స్ను పాటించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. పండుగ సీజన్ వచ్చిందని, ఇలాంటి సమయంలోనే దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష చక్ర నుంచి ఎవరూ బయటికి వెళ్లొద్దని మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.