మన సమాజం, విలువలు స్వలింగ వివాహాలను గుర్తించవు: ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
స్వలింగ సంపర్కానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, స్వలింగ వివాహాలకు మాత్రం అనుమతి ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్వలింగ వివాహాలను గుర్తించి నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను నేడు కేంద్రం వ్యతిరేకించింది. హిందూ వివాహ చట్టం 1956 ప్రకారం స్వలింగ వివాహాలను కూడా నమోదు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానంగా కేంద్రం మన చట్టం, సమాజం, విలువలు స్వలింగ వివాహాన్ని గుర్తించవని పేర్కొంది.
స్వలింగ వివాహాన్ని గుర్తించటం సాధ్య కాదన్న కేంద్రం .. వివాహానికి స్త్రీ, పురుషుడు మాత్రమే
స్వలింగ జంట మధ్య జరిగే వివాహాన్ని గుర్తించడం సాధ్యం కాదని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వివాహం జరగడానికి ఒక పురుషుడు మరియు స్త్రీ ఉండాలని ఆయన పేర్కొన్నారు. హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 ప్రకారం నిషేధించబడిన సంబంధంగా స్వలింగ వివాహం ఉందన్నారు. సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేవలం స్వలింగ సంపర్కాన్ని, లేదా లెస్బియన్ లకు సంబంధించిన శారీరక సంబంధానికి వర్తిస్తుందని మెహతా పేర్కొన్నారు. అంతకుమించి స్వలింగ సంపర్క అనుమతి స్వలింగ వివాహాలకు వర్తించదని ఆయన అన్నారు.
స్వలింగ సంపర్కం చట్టబద్ధం అయితే స్వలింగ వివాహాలకు అడ్డంకి దేనికి అన్న పిటీషనర్లు
పిటిషనర్ల వాదన మాత్రం వేరేలా ఉంది. హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 5 ప్రకారం స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపు లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. హిందూ వివాహ చట్టం గుర్తించేలా ఆదేశాలివ్వాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఇంతకు ముందు ఎటువంటి ప్రకటనలు లేనప్పుడు ఈ వివాహాలను అనుమతించలేదని, ఇప్పుడు స్వలింగ సంపర్కులకు సంబంధించిన అనుమతి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో, వారి వివాహాలకు కూడా గుర్తింపు ఇచ్చేలా మార్చాలని వారు కోర్టును కోరారు.
స్వలింగ సంపర్కుల పెళ్ళికి అవరోధాలు లేకుండా చట్టంలో మార్పులకు ఆదేశించాలని విజ్ఞప్తి
స్వలింగ సంపర్కుల పెళ్ళికి అవరోధాలు లేకుండా హిందూ వివాహ చట్టంలో మార్పులకు ఆదేశించాలని, ఢిల్లీకి చెందిన రాఘవ్ అశ్వతి, ముఖేష్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వారు పేర్కొన్నారు. చాలామంది లెస్బియన్ లు, గేలు, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీకి చెందిన ఒంటరి వారిగా చూస్తున్నారే తప్ప జంటలుగా చూడటం లేదని పేర్కొన్నారు. చాలామంది తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ఆ ఇబ్బందిని తొలగించేందుకే కోర్టు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
వారి ఇబ్బందులను రికార్డ్ చెయ్యమన్న కోర్టు ధర్మాసనం .. కేసు అక్టోబర్ కు వాయిదా
తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలనే కోరికను బలవంతంగా ఆపుకుంటున్నారని పేర్కొన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రా సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క సంబంధాలపై చట్టపరమైన అడ్డంకులు లేవని తీర్పు ఇచ్చిందని వాదించారు. స్వలింగ సంపర్కుల వివాహాలను నిరాకరించడం వారి సమానత్వ హక్కు, జీవన హక్కును ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం స్వలింగ సంపర్కుల వివాహాలను నమోదు చేయకపోవడంపై బాధపడుతున్న వాస్తవ సంఘటనలను రికార్డ్ చేయమని పిటిషనర్లను కోర్టు ఆదేశించింది. ఇక ఈ కేసును అక్టోబర్ నెల కు వాయిదా వేసింది.