బీజేపీ హిందుత్వ అజెండాకు మాది భిన్నం: అమిత్ షాపై ఉద్దవ్ ఆగ్రహం
ముంబై: అవిశ్వాస తీర్మానం సందర్భంగా శివసేన ఓటింగ్కు దూరం జరిగింది. బీజేపీపై చాలాకాలంగా శివసేన అధినేత ఉద్దవ్ థాకరే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, మరోసారి ఆయన నిప్పులు చెరిగారు. బీజేపీ హిందుత్వ అజెండాకు, తమ అజెండాకు పోలిక లేదని చెప్పారు.
గత నాలుగేళ్లుగా దేశంలో కొనసాగుతున్న హిందుత్వాన్ని తాము అంగీకరించమని చెప్పారు. తమది అలాంటి హిందుత్వ అజెండా కాదన్నారు. ప్రస్తుతం మన మహిళలకు రక్షణ లేదన్నారు. కానీ మీరు మాత్రం (బీజేపీ) ఆవులను రక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.
గోరక్షణ పేరుతో ఆవుల రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను దేశంలో మహిళల భద్రతకు ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా సాగుతున్నది మన హిందుత్వ విధానం కాదన్నారు. ప్రజలు ఏం తినాలో మీరే నీర్దేశించలేరన్నారు.
2019 లోకసభ ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకోబోమని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ బీజేపీకి బహిరంగంగానే మద్దతిచ్చిందని, ఇప్పుడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ ధన బలం, కండ బలం, ఈవీఎంల టాంపరింగ్ ద్వారానే ఎన్నికల్లో విజయం సాధిస్తోందన్నారు. దేశంలో నకిలీ ప్రజాస్వామ్యం ఉందన్నారు.