ఛాతీ ఉప్పొంగుతోంది: ఎంత ట్రై చేసినా తమిళం రావట్లేదు: మోడీ: చింతల వెంకటరెడ్డి ప్రస్తావన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్.. నీటి వనరుల పరిరక్షణ ప్రాధాన్యత స్పృశించింది. ఇక వచ్చేది వేసవికాలం కావడం వల్ల జల వనరులను సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ జల వనరులను పెంపొందించుకోవడం, పూడిక తవ్వకాల గురించి ప్రదాని దేశ ప్రజలకు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉన్న నీటి కుంటలు, చెరువులను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వేసవి కాలం ముగిసే వరకూ నీటి వనరులను కాపాడుకోవాలని అన్నారు.
తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన కొందరు గ్రామస్తులు.. జల వనరుల పరిరక్షణ కోసం చేసిన కార్యక్రమాలను ప్రధాని తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ యువత పూనుకుంటే ఎలాంటి కార్యక్రమాలనైనా విజయవంతం చేయగలుగుతారని అన్నారు. సంత్ రవిదాస్ చేసిన బోధనలను మోడీ ప్రస్తావించారు. దేశ యువతిపై సంత్ రవిదాస్ ప్రభావం ఉందని చెప్పారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారని అన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళకు చెందిన యోగేశ్వరన్ నమో యాప్పై రాసిన అంశాన్ని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. శాస్త్రీయ రంగంలో దేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని, ఆత్మనిర్భర్ భారత్ దీనికి వేదికగా మారిందని అన్నారు. ల్యాబ్ టు ల్యాబ్ స్థాయిలో అభివృద్ధి చేస్తోన్నామని అన్నారు. సైన్స్ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్కు చెందిన చింతల వెంకటరెడ్డి వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయనకు పద్మశ్రీ అవార్డును అందించామని గుర్తు చేశారు.
తమిళం.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అని ప్రధాని అన్నారు. ఆ భాషకు ఎంతో చరిత్ర, ప్రాధాన్యత ఉందని చెప్పారు. తమిళం భాషను నేర్చుకోవడానికి తాను చాలా ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. దాన్ని నేర్చుకోలేకపోతున్నానని నరేంద్ర మోడీ అన్నారు. తమిళం నేర్చుకోలేకపోతోన్నందుకు చింతిస్తున్నానని అన్నారు. జీవితంలో తాను కోల్పోయినది ఏదైనా ఉందీ అంటే- అది తమిళభాషను నేర్చుకోలేకపోవడమేనని మోడీ.. మన్ కీ బాత్లో వివరించారు.