కర్ణాటక సీఎల్ పీ మీటింగ్, మరో 10 మంది ఎమ్మెల్యేలు ఢుమ్మా, 78 మందికి 57 మంది హాజరు !
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురైనారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం (సీఎల్ పీ) నిర్వహించినా రెబల్ ఎమ్మెల్యేలకు తోడు మరో 19 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో ఏం చెయ్యాలో దిక్కతోచక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. 78 మంది ఎమ్మెల్యేల్లో 57 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సీఎల్ పీ సమావేశానికి హాజరైనారు.
ఎమ్మెల్యేలకు విప్ జారీ
మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నేత సిద్దరామయ్య ఆధ్యక్షతన మంగళవారం బెంగళూరులో సీఎల్ పీ సమావేశం జరిగింది. సీఎల్ పీ సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని విప్ జారీ చేశారు. అయితే రాజీనామాలు చేసిన ఏ ఒక్క ఎమ్మెల్యే సీఎల్ పీ సమావేశానికి హాజరుకాలేదు.
ఎమ్మెల్యేలు ఢూమ్మా !
ఇప్పటి వరకూ రాజీనామా చెయ్యని మాజీ మంత్రి ఎంటీబీ. నాగరాజ్, అంజలి నింబాల్కర్, సంగమేష్, బి. నాగేంద్ర, శ్యామనూరు శివశంకరప్ప, కే. సుధాకర్, టీడీ. రాజేగౌడ, ఇ. తుకారం, శివన్న, ఖని ఫాతిమా, రామప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన బెంగళూరులోని శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం జరిగిన సీఎల్ పీ సమావేశానికి హాజరుకాలేదు. అనారోగ్యంతో తాను చికిత్స పొందుతున్నానని, తాను సమావేశానికి హాజరుకాలేనని మాజీ మంత్రి ఎంటీబీ. నాగరాజ్ లేఖ పంపించారు.
రామలింగా రెడ్డి కుమార్తె
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె, బెంగళూరులోని జయనగర ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి మంగళవారం జరిగిన సీఎల్ పీ సమావేశానికి హాజరై అందరికి షాక్ ఇచ్చారు. తన తండ్రి రామలింగా రెడ్డి రాజీనామా చేశారని, తాను మాత్రం రాజీనామా చెయ్యలేదని ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి అన్నారు.
78 మంది ఎమ్మెల్యేల్లో 57 మంది హాజరు !
ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి రామలింగా రెడ్డి, ఆనంద్ సింగ్, సుధాకర్ బెంగళూరులోనే ఉన్నా సీఎల్ పీ సమావేశానికి హాజరుకాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన సీఎల్ పీ సమావేశానికి 57 మంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరైనారు.
సీఎం సోదరుడే కారణం !
మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఇంత మంది రాజీనామాలు చెయ్యడానికి సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ ప్రధాన కారణం అని అనేక మంది ఎమ్మెల్యేలు సీఎల్ పీ సమావేశంలో బహిరంగా మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వంలో అందర్ని కలుపుకునిపోవడంలో సీఎం సోదురుడు రేవణ్ణ ఏకపక్షంగా వ్యవహరించారని, అందుకే కోపంతో ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చాల మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.