అరుదైన ఘనత సాధించిన ఆ మహిళా పోలీస్... ఢిల్లీ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి...
ఢిల్లీ పోలీస్ చరిత్రలోనే ఇదో అరుదైన సందర్భం. మొట్టమొదటిసారి పోలీస్ శాఖలో నిబంధనలతో పనిలేకుండా ఓ మహిళా పోలీస్ అధికారిని ప్రమోషన్ వరించింది. హెడ్ కానిస్టేబుల్ నుంచి పదోన్నతి లభించింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మంది మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెట్టినందుకు ఆమెకు ఈ పదోన్నతి దక్కింది. అవుటాఫ్ టర్న్ ప్రమోషన్ దక్కించుకున్న ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ పేరు సీమా ఢాకా...
Recommended Video
సీమా ప్రతిభపై ప్రశంసలు...
సీమా ఢాకాకు అవుటాఫ్ టర్న్ ప్రమోషన్ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం(నవంబర్ 18) ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం సీమా ఢిల్లీ పరిధిలోని సమయ్పూర్ బద్లీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేవలం 3 నెలల వ్యవధిలోనే 76 మిస్సింగ్ కేసులను చేధించి ఆ చిన్నారులను రక్షించారు. ఇందులో 56 మంది చిన్నారులు 14 ఏళ్ల లోపు వారే. సీమా ఢాకా కృషి వల్ల 76 కుటుంబాల్లో సంతోషం నెలకొందని... ఆమె పోరాట పటిమ పోలీస్ శాఖకు స్పూర్తిదాయకమని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ కొనియాడారు.
ఇతర రాష్ట్రాల కేసులు కూడా...
సీమా ఢాకా మాట్లాడుతూ... కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా పశ్చిమ బెంగాల్,పంజాబ్,బిహార్,ఘజియాబాద్,పానిపట్,గుర్గావ్ తదితర రాష్ట్రాల,నగరాలకు చెందిన చిన్నారులను కూడా తాను రక్షించినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్కి చెందిన ఓ మిస్సింగ్ కేసు కోసం చాలా శ్రమించినట్లు తెలిపారు. 2018లో బెంగాల్కి చెందిన ఓ ఏడేళ్ల చిన్నారి కనిపించకుండా పోయాడని... 2020లో ఎట్టకేలకు అతన్ని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చానని తెలిపారు. మిస్సింగ్ కేసులను డీల్ చేయడంలో సీమా ఢాకా ప్రతిభను మెచ్చి పొరుగు రాష్ట్రాలు కూడా ఆమెకు కొన్ని ప్రత్యేక కేసులు అప్పగించడం విశేషం.
2006లో విధుల్లోకి...
ఢిల్లీ పోలీస్ శాఖలో మహిళా కానిస్టేబుల్గా జులై 3,2006లో సీమా విధుల్లో చేరారు. 2014లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందారు. 2012 వరకు ఆగ్నేయ ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఔటర్ డిస్ట్రిక్ట్కి బదిలీ అయ్యారు. అక్కడినుంచి ఔటర్ నార్త్కి బదిలీ అయ్యారు. తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల సీమా సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ఉన్నతాధికారులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులను తిరిగి వారి అక్కున చేర్చిన సీమాకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాలని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అగస్టులో ఆ ప్రకటన...
ఈ ఏడాది అగస్టులో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అడిషనల్ ఇన్సెంటివ్స్ గ్రాంట్స్తో పాటు,అవుటాఫ్ టర్న్ ప్రమోషన్ అవకాశాన్ని ప్రకటించారు. ఎవరైనా కానిస్టేబుల్ 12 నెలల వ్యవధిలో 50 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో మిస్సింగ్ చిన్నారుల ఆచూకీని కనిపెడితే వారికి ఆ అవకాశం ఉంటుందని తెలిపారు. అందులో కనీసం 15 మంది చిన్నారులు కనీసం 8 ఏళ్ల లోపు వారై ఉండాలన్న నిబంధన పెట్టారు. పోలీస్ శాఖ పెట్టిన టార్గెట్ కంటే సీమా ఢాకా అతి తక్కువ వ్యవధిలోనే 76 మంది చిన్నారుల ఆచూకీని కనిపెట్టడం నిజంగా అభినందనీయం.