అదానీ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి...అసలు ఏం జరుగుతోంది..?
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీలో బుధవారం ప్రభుత్వం నుంచి ఓ విషాదకరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి చెందిన జీకే జనరల్ ఆస్పత్రిలో గత ఐదేళ్లలో వెయ్యి మంది చిన్నారులు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆస్పత్రి కచ్ జిల్లాలోని భుజ్ పట్టణంలో ఉంది. కాంగ్రెస్కు చెందిన సంతోక్బెన్ అరేథియా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అదానీ ఫౌండేషన్ కింద నడుస్తున్న హాస్పిటల్లో 1,108 చిన్నారులు గత ఐదేళ్లలో మృతి చెందినట్లు తెలిపారు.
ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం నితీష్ పటేల్ సవివరంగా సమాధానం ఇచ్చారు. 2014-15లో 188 మంది చిన్నారులు మృతి చెందగా... 2015-16లో 187 మంది, 2016-17లో 208 మంది, 2017-18లో 276 మంది 2018 నుంచి ఇప్పటి వరకు 159 మృతి చెందినట్లు నితిన్ పటేల్ సభకు వివరించారు. వీరంతా వివిధ జబ్బులతో మరణించినట్లు ఆయన వెల్లడించారు.
ఇక చిన్న పిల్లలు మృతి అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందని చెప్పిన నితిన్ పటేల్... దీనిపై గతేడాది మేలో కమిటీ వేశామని గుర్తుచేశారు. కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించిందని స్పష్టం చేశారు. చిన్న పిల్లల మృతికి పలు కారణాలున్నాయని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు నితిన్ పటేల్ సభ దృష్టికి తీసుకొచ్చారు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఓ రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతిచెందగా... మరికొందరు పిల్లల్లో ఇన్ఫెక్షన్ సోకి మృతిచెందినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. అయితే అదానీ హాస్పిటల్లో మాత్రం చిన్నారులకు మంచి చికిత్సను అందిస్తున్నట్లు చెప్పిన నితిన్ పటేల్... అన్ని ప్రొటోకాల్స్, మార్గదర్శకాలను అనుసరించే చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.