మోదీ 'మన్ కీ బాత్'కి 2.5లక్షల డిస్లైక్స్... విద్యార్థుల ఆగ్రహమే కారణమా..?
ప్రధాని నరేంద్ర మోదీ తాజా 'మన్ కీ బాత్' కార్యక్రమానికి యూట్యూబ్లో 2.5లక్షల డిస్లైక్స్ వచ్చాయి. బీజేపీ అధికారిక యూట్యూబ్ చానెల్లో అత్యధిక డిస్లైక్స్ వచ్చిన వీడియోల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఆదివారం(అగస్టు 31) మోదీ జాతిని ఉద్దేశించి 'మన్ కీ బాత్'లో మాట్లాడగా... సోమవారం ఉదయం 9గంటల వరకు యూట్యూబ్లో ఆ వీడియోకి 28వేల లైక్స్,2.5లక్షల డిస్లైక్స్ వచ్చాయి. 3.5మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ బీజేపీ చానెల్లో మోదీ మన్ కీ బాత్ వీడియోని 10లక్షల మంది వీక్షించారు.
నీట్,జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆగ్రహం మోదీ వీడియోకి భారీ డిస్లైక్స్ రావడంలో ప్రధాన కారణం. చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పలుమార్లు తమ నిరసనను వ్యక్తం చేసిన విద్యార్థులు తాజాగా మోదీ వీడియోకి డిస్లైక్స్ కొట్టి మరోసారి తమ నిరసన తెలియజేశారు.
మరోవైపు సెప్టెంబర్ 30 లోపు యూనివర్సిటీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని యూజీసీ జులై 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సుప్రీం కూడా సమర్థించింది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయవద్దని కోరింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులు పరీక్షల నిర్వహణ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు.
Recommended Video
అటు నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను సుప్రీం కూడా ఇదివరకే సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని మరోసారి సుప్రీంలో సవాల్ చేశాయి. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ,హేమంత్ సొరెన్,ఉద్దవ్ థాక్రే,అమరీందర్ సింగ్,అశోక్ గెహ్లాట్,భూపేశ్ బాగెల్లు సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పునే ఇస్తుందా లేదా విద్యార్థుల వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి. కాగా,నీట్ సెప్టెంబర్ 13న జేఈఈ సెప్టెంబర్ 1-6 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే.