coronavirus lockdown: 20 లక్షల ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం..? తగ్గిన డిమాండ్...
కరోనా వైరస్ ప్రభావం విమానయాన శాఖపై భారీగా పడే అవకాశం ఉంది. విమానయాన శాఖ, దాని అనుబంధ విభాగాల్లో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ప్రమాదం అంచున ఉన్నాయని అంతర్జాతీయ విమానయాన సంస్థ ఐఏటీఏ పేర్కొన్నది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో కూడా విమానాల రాకపోకలను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మే 3వ తేదీ వరకు విమాన సేవల నిలిచిపోనున్నాయి.
విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపై ఆలోచిస్తున్నాయి. కొందరు పైలట్లకు జీతం ఇవ్వకుండానే తొలగించే ప్రయత్నాలు ప్రారంభించింది. మాంద్యంతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని.. దీనికి భారత్ అతీతంగా కాదని ఐఏటీఏ పేర్కొన్నది. లాక్ డౌన్ వల్ల 8.8 బిలియన్ డాలర్లు ప్రయాణికుల నుంచి సంస్థలు కోల్పోయాయని.. అంతకుముందు 36 శాతం డిమాండ్ కూడా తగ్గిందని పేర్కొన్నది. దీంతో 20 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. దీనిని లోన్, లోన్ గ్యారంటీ, బాండ్ల ద్వారా విమానయాన సంస్థలు అధిగమించొచ్చని సూచించారు. ఈ క్రమంలో పన్ను, లెవీలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా లేదంటే పాక్షికంగా తీసేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐఏటీఏ 314 బిలియన్ డాలర్ల ఆదయం కోల్పోయింది. ప్రయాణికుల డిమాండ్ కూడా 2019 ఏడాదితో పోలిస్తే 48 శాతం పడిపోయిందని పేర్కొన్నది. విమానయాన సంస్థ సంక్షోభంలో చిక్కుకొందని పేర్కొన్నారు. 2020 రెండో త్రైమాసికం కోసం 61 బిలియన్ డాలర్లను సమాకూర్చుకోవాల్సి ఉందని తెలిపింది. దీంతో 25 లక్షల మంది ఉద్యోగాలను కాపాడుకోగలుగుతామని వివరించారు. తామే కాదు చాలా విమానయాన సంస్థల పరిస్థితి ఇదేనని పేర్కొన్నది.