దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి, కానీ..: పాక్ కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాకిస్థాన్లో కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇందుకోసం సుమారు 300లకుపైగా ట్విట్టర్ ఖాతాలు సృష్టించారని ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్(ఇంటెలీజెన్స్) దీపేంద్ర పాఠక్ వెల్లడించారు.
Recommended Video
ఆదివారం సాయంత్రం పాఠక్ మీడియాతో మాట్లాడుతూ.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగనుందని తెలిపారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు జనవరి 13 నుంచి 18 తేదీల మధ్య పాకిస్థాన్లో సుమారు 300 ట్విట్టర్ ఖాతాలు సృష్టించారని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతోనే వీటిని సృష్టించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసిందన్నారు.
సవాలుతో కూడినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుందని సీపీ తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోకి రైతులు ప్రవేశించేందుకు అనుమతిస్తున్నామని, అదే సమయంలో వేడుకలకు ఏ మాత్రం ఆటంకం కలగకుండా ర్యాలీ నిర్వహించుకుకోవాలని రైతులకు సూచించినట్లు స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ స్పష్టం చేశారు.
గణతంత్ర వేడుకల అనంతరం ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. కాగా, పోలీసులు అనుమతిచ్చిన విషయాన్ని రైతు సంఘాల నేతలు శనివారమే తెలుపగా, పోలీసులు మాత్రం ఆదివారం వెల్లడించారు. అటు గణతంత్ర వేడుకలు, ఇటు ట్రాక్టర్ ర్యాలీ ఉండటంతో దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించే మార్గాల్లో మరిన్ని బలగాలను మోహరించారు.
దేశ రాజధాని సరిద్దులో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా పంజాబ్, హర్యానా రైతులు ఆందోళనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దుకు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తుండగా.. కేంద్రం మాత్రం చట్టాల రద్దు మినహా ఏది అడిగినా చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే పది సార్లు కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు. మరోసారి చర్చలు జరిపేందుకు ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటిన్నర సంవత్సరాలపాటు వ్యవసాయ చట్టాల అమలును వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం ప్రకటించినప్పటికీ.. తమకు చట్టాల రద్దు తప్ప ఏమీ అవసరం లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంతకన్నా మంచి ప్రతిపాదన తాము చేయలేమని కేంద్రం తేల్చి చెప్పింది.