భారత్ ప్రతిదాడి: ఆపరేషన్లో 45ని.ల్లో 38 మంది మృతి
న్యూఢిల్లీ: భారత సైన్యం మంగళవారం బంగ్లాదేశ్ లోపలికి వెళ్లి, ఈ నెల 4న మణిపూర్లో 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మిలిటెంట్ల దాడితో సంబంధం ఉందని భావిస్తున్న మిలిటెంట్లపై దాడి చేసిన ఒకరోజు తర్వాత ఈ దాడి భారత్లో భయోత్పాతం సృష్టించే శక్తులకు ఒక గుణపాఠం అవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం అన్నారు.
మైన్మార్ ప్రభుత్వం తోడ్పాటుతో మిలిటెంట్లపై సైన్యం జరిపిన దాడి ఉగ్రవాదంపై పోరాటానికి భారత దేశ కృతనిశ్చయాన్ని చాటి చెబుతోంది. ఇది అన్ని ఉగ్రవాద ముఠాలకు ఒక గుణపాఠమే కాకుండా ఉగ్రవాదులను అంతమొందించడానికి భారత్ తన భౌగోళిక సరిహద్దులను సైతం దాటి వెళ్లడానికి ఎంతమాత్రం వెనకాడబోదనే సందేశాన్ని కూడా ఇస్తోందన్నారు.
4నే దాడికి నిర్ణయం
కాగా, మంగళవారం భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు మైన్మార్ భూభాగంలో జరిపిన పరిమిత దాడిలో 38 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మిలిటెంట్లు హతం కాగా, మరో ఏడుగురు గాయపడ్డారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భారత సైన్యం మొట్ట మొదటిసారి జరిపిన ఈ దాడికి సంబంధించిన పథక రచన ఈ నెల 4న మణిపూర్లోని చందేల్ ప్రాంతంలో మిలిటెంట్లు సైన్యం కాన్వాయ్పై జరిపిన దాడిలో 18 మంది సైనికులు మృతి చెందిన కొద్ది గంటలకే జరిగిందని, ఈ నెల 7వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అనుమతి తీసుకోవడం జరిగిందని ఈ సంఘటనతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
మణిపూర్ దాడి జరిగిన మరుసటి రోజే మిలిటెంట్ల శిబిరంపై దాడి చేయాలని ఈ నెల 4న కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఉన్నతస్థాయి సమావేశంలోనే మొట్టమొదటిసారిగా సూచన వచ్చినట్లు ఆ వర్గాలు బుధవారం తెలిపాయి.
అయితే ఇంత తక్కువ వ్యవధిలో దాడి జరపలేమని ఆర్మీ చీఫ్ చెప్పారు. దీంతో సోమవారం నాడు ఈ దాడి జరపాలని నిర్ణయించారు.
ఆపరేషన్ ప్రణాళిక సిద్ధమైన సమయంలో మోడీ బంగ్లాదేశ్లో ఉన్నారు. దీంతో సోమవారం జరపాల్సిన దాడిని, ఆయన అనుమతుల కోసం మంగళవారం తెల్లవారుజాముకు వాయిదా వేశారు. బంగ్లా నుంచి ప్రధాని వచ్చాక ప్రణాళికను ఆయనకు వివరించారు.
అనంతరం దాడిలో సుమారు 70 మంది కమాండోలు పాల్గొన్నారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక దళాలతో భూతల దాడులకు తోడుగా సుఖోయ్- మిగ్-29, రాకెట్ లాంఛర్లు, రైఫిళ్లు, నైట్ విజన్ గూగుల్స్ను తీసుకెళ్లారు.
మయన్మార్ సరిహద్దులో ధ్రువ్ హెలికాప్టర్ నుంచి దిగగానే వీరు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఆ తర్వాత ఆ రెండు గ్రూపులు మరో రెండు రెండు సబ్ గ్రూపులుగా విడిపోయాయి.
నలభై నిమిషాల్లో ఆపరేషన్ను కమేండోలు పర్తి చేశారు. ఏదైనా ఊహించని సంఘటన ఎదురైతే కమాండోలను తరలించడం కోసం భారత వాయుసేనకు చెందిన మిగ్ 17 విమానాలను సిద్ధంగా ఉంచారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభమైంది.