కేంద్ర ప్రభుత్వశాఖల్లో 4లక్షల ఉద్యోగాలు: తర్వలోనే భర్తీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం, కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలేయడంతో లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖల్లో 4లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఈ మేరకు లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
'2016 మార్చి 1 నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి' అని జితేంద్రసింగ్ వెల్లడించారు.
త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అంతేగాక.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్దకు రాలేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.