"రోడ్లు ఊడ్చే కొలువులకు పీజీ అభ్యర్థులు"
కాన్పూర్ : ప్రభుత్వాల వైఫల్యమో..! చదువుల్లో నాణ్యతా లోపమో..! దేశంలో ప్రతీ ఇంట్లోను నిరుద్యోగులున్న పరిస్థితి. వందల్లో ఉండే ఖాళీలకు నిరుద్యోగుల నుంచి లక్షల్లో దరఖాస్తులు పోటెత్తుతున్నాయంటేనే దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే.. చదివిన చదువుతో సంబంధం లేకుండా.. ఏ ఉద్యోగం చేయడానికైనా రెడీ అంటున్నారు పట్టభద్రులు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన స్వీపర్ పోస్టులకు అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్స్, మాస్టర్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
స్వీపర్ పోస్టులకు ప్రత్యేకించి పలానా విద్యార్హత అంటూ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో.. డిగ్రీలు, పీజీలు చేత బట్టుకుని స్వీపర్ ఉద్యోగాల కోసం క్యూ కట్టారు చాలామంది. కాగా, మొత్తం 3275 పోస్టులకు గాను ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీల్లో 1500 పోస్టులు జనరల్ కేటగిరి కాగా, మిగతా పోస్టులు ఆయా రిజర్వేషన్ల పరిధిలో ఉన్నాయి.