కొంపముంచిన హంపి ఎక్స్ప్రెస్.. నీట్ పరిక్ష్ మిస్.. వందలమంది అభ్యర్థుల ఆందోళన
బెంగళూరు: హంపి ఎక్స్ప్రెస్ కొంపముంచింది. వందలాది మంది అభ్యర్థుల జీవితాలను సర్వనాశనం చేసేసింది. ఏడాది పొడవునా కష్టపడి చదువుకున్న అభ్యర్థుల శ్రమను బూడిదలో పోసిన పన్నీరులా చేసింది. తమ పిల్లల బంగారు భవిషత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, కోచింగ్ల సెంటర్లకు వేల రూపాయలను ఫీజుల రూపంలో ఖర్చు చేసిన తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేసింది. హంపి ఎక్స్ప్రెస్ ఏడు గంటల పాటు ఆలస్యంగా నడవడం వల్ల ఉత్తర కర్ణాటకుకు చెందిన సుమారు 500 మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయలేకపోయారు. నిర్ణీత గడువు ప్రకారం.. ఉదయం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సిన హంపి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంది. ఫలితంగా ఆ రైలు ద్వారా బెంగళూరుకు రావాల్సిన అభ్యర్థులు సకాలంలో చేరుకోలేకపోయారు. పరీక్షలను రాయలేకపోయారు.
గడువు దాటితే అంతే..
ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తరువాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోని రానివ్వరు.
ఏడు గంటలు ఆలస్యంగా..
నీట్ కోసం బెంగళూరులో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకకు చెందిన విద్యార్థులంతా ఈ కేంద్రానికే రావాల్సి ఉంటుంది. పరీక్ష రాయడానికి కొప్పళ, బళ్లారి జిల్లాల నుంచి సుమారు 500 మంది వరకు అభ్యర్థులు హంపి ఎక్స్ప్రెస్పై ఆధారపడ్డారు. హంపి నుంచి సాయంత్రం 6:20 నిమిషాలకు బయలుదేరాల్సిన ఈ రైలు రెండు గంటలు అంటే 8:20కి ప్రయాణమైంది. ఈ రైలు ఉదయం 7 గంటలకు బెంగళూరుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆదివారం మాత్రం ఏడు గంటల పాటు ఆలస్యంగా నడిచింది.
నాన్ ఇంటర్లాకింగ్ పనుల వల్ల దారి మళ్లింపు
సాధారణంగా ఈ రైలు బళ్లారి-గుంతకల్లు-ధర్మవరం-పెనుకొండ-యలహంకల మీదుగా ప్రయాణిస్తుంది. గుంతకల్లు-కళ్లూరు స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు నడుస్తున్నాయి. ఫలితంగా ఈ రైలును బళ్లారి-రాయదుర్గం-చిక్కజాజూరు-అరిసికెరె-తుమకూరు మధ్య నడిపిస్తున్నారు. ఆదివారం కూడా ఈ మార్గంలోనే ప్రయాణించింది హంపి ఎక్స్ప్రెస్. దీని ప్రభావం రైలు సమయపాలనపై పడింది. ఉదయం 7 గంటలకు బెంగళూరుకు రావాల్సిన రైలు మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంది. రెండు గంటలకే పరీక్ష ప్రారంభమైంది. దీనితో ఈ రైలులో ప్రయాణించిన అభ్యర్థులు పరీక్షలను రాయలేకపోయారు. వారంతా బెంగళూరులోని దయానంద కాలేజీ, ప్రెసిడెన్సీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంది.
ప్రాథేయపడ్డా కనికరించలేదు..
రైలు ఆలస్యంగా నడవటం వల్ల తాము పరీక్ష రాయలేకపోతున్నామనే విషయాన్ని బళ్లారికి చెందిన సాయి శ్రీనివాస్ అనే అభ్యర్థి ట్వీట్ చేశారు. దీన్ని ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు ట్యాగ్ చేశారు. అలాగే- తమకు ఆదుకోవాల్సిందిగా కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తాను 2:55 నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నానని, రైలు ఆలస్యంగా నడవటం వల్ల సకాలంలో పరీక్షా కేంద్రానికి హాజరు కాలేకపోయానని సాయి శ్రీనివాస్ నిర్వాహకులకు ప్రాథేయపడినప్పటికీ.. వారు అనుమతించ లేదని కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ పరిస్థితిని తాను మాత్రమే ఎదుర్కొనట్లేదని, 500 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని అన్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరారు.
మీ క్యాబినెట్ మంత్రి చేతగాని తనం వల్లే..
ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగును పులుముకొంది. ఈ ఘటనపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకేసుకొస్తున్న క్యాబినెట్ మంత్రి పీయూష్ గోయల్ చేతగాని తనం వల్లే అభ్యర్థులు పరీక్షలు రాయలేకపోయారని విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అని ఆయన నిలదీశారు.