షాక్: ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు సహా 93వేల మంది దరఖాస్తు, అందుకేనని
న్యూఢిల్లీ: ఓ వైపు ఉద్యోగాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. మరోవైపు ప్యూన్ ఉద్యోగం కోసం 93వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇంకా షాకింగ్ ఏమంటే ఇందులో 3700 మంది పీహెచ్డి విద్యార్థులు ఉండటం గమనార్హం.
ఈ ఉద్యోగం కోసం అయిదో తరగతి అర్హత. కానీ పీహెచ్డి నిరుద్యోగులు సహా ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగ భద్రత అంతగా లేకపోవడంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా ఫర్వాలేదనే అభిప్రాయంతో ఉన్నారు.
ఈ సంఘటన యూపీలో జరిగింది. పోలీస్ శాఖలో మెసెంజర్గా విధులు నిర్వహించడానికి జారీ చేసిన 62 పోస్టుల కోసం 93,000 మంది అభ్యర్థులు అక్కడ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,700 మంది పీహెచ్డి విద్యార్థులు కాగా, 28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 50 వేలమంది గ్రాడ్యుయేట్లు అని సమాచారం. అయిదో తరగతి అర్హతగా నిర్ణయించిన ఉద్యోగానికి ఇంత భారీస్థాయిలో ఉన్నత విద్యనభ్యసించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కేవలం బైక్ నడిపే మెళకువలు తెలుసునంటూ వ్యక్తిగతంగా నివేదించడం ద్వారా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయితే విస్తృతంగా దరఖాస్తులు రావడంతో రాత పరీక్షను నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం బేసిక్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మాథమెటిక్స్తో కూడిన పరీక్ష పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్మ్యాన్ తరహాలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్కు ఉత్తరప్రత్యుత్తరాలు అందించాలి. నెలకు రూ.20 వేలు వేతనం ఉన్నందువల్ల ఇంతస్థాయిలో స్పందన వచ్చిందని చెబుతున్నారు.
అయితే ఇది దేశంలో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం అని అంటున్నారు. ఇటీవల రైల్వేశాఖ దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా రెండు కోట్ల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ముంబైలో ఈ ఏడాది ప్రారంభంలో 1,100 పోలీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరగా రెండు లక్షల దరఖాస్తు చేసుకున్నారు. వారిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు ఉన్నారు. రాజస్థాన్లోనూ ప్యూన్ ఉద్యోగానికి 129మంది ఇంజినీర్లు, 23మంది లాయర్లు, ఒక ఛార్టెడ్ అకౌంటెంట్ దరఖాస్తు చేసుకున్నారు.