ఆయన ఖాతాలోకి రాత్రికి రాత్రే 62 లక్షలు వచ్చిపడ్డాయి
లక్నో :పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం సామాన్యులతో పాటు నల్లధనం కూడబెట్టినవారిని కూడ ఇబ్బందులకు గురిచేస్తోంది. నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు కుభేరులు కష్టాలుపడుతున్నారు.తమకు తెలిసినవారి ఖాతాల్లో నల్ల కుబేరులు తమ ధనాన్ని జమ చేస్తున్నారు. ఈ తరహ సంఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది. తాపీమేస్త్రీ బ్యాంకు ఖాతాలో రాత్రికి రాత్రే 62 లక్షల నగదు జమ అయింది.
పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ, తేదిన నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా ప్రజలు చిల్లర నగదు కోసం ఇబ్బందిపడుతున్నారు.అజయ్ కుమార్ పటేల్ అనే వ్యక్తి ముంబాయిలో నివాసం ఉంటున్నాడు తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన బ్యాంకు కాతాలో 6728 రూపాయాల నగదు ఉంది.
అజయ్ కుమార్ పటేల్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ ఘర్ జిల్లా.అయితే పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తన బ్యాంకు ఖాతాలో రాత్రికి రాత్రే 62 లక్షల రూపాయాల నగదు జమ అయిందని ఆయన ఫోన్ కు మేసేజ్ వచ్చింది. అయితే ఈ మేసేజ్ ను ఆయన చూసుకోలేదు.పలు కంపెనీలు పంపే అడ్వర్ టైజ్ మెంట్ మేసేజ్ లని భావించి వదిలేశాడు.
అజయ్ కుమార్ కు బ్యాంకు ఖాతా ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉంది. ఇటీవలే ఆయన స్వంత గ్రామానికి వెళ్ళాడు. తన నగదును డ్రా చేసుకోవడానికి ఎటిఎం వద్ద కు వెళ్ళగానే ఆయన అకౌంట్ ను సీజ్ చేసినట్టు సమాచారం తెలిపింది ఎటిఎం. దీంతో ఆయన వెంటనే తన ఫోన్ కు వచ్చిన మేసేజ్ ను చూసుకొని అవాక్కయ్యాడు. తన ఖాతాలోకి 62 లక్షల రూపాయాలు రాత్రికి రాత్రే జమ అయ్యాయని చూసి ఆశ్చర్యపోయాడు.ఈ బ్యాంకులో జమ చేసిన నగదు తనది కాదని అజయ్ చెబుతున్నాడు. తన 7 వేల రూపాయాల నగదును వెంటనే తాను డ్రా చేసుకొనే అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నాడు.