మొత్తం ప్యాకేజీ విలువ రూ.20 లక్షల 97 కోట్లు: అయిదుదశల్లో ఇలా సర్దుబాటు చేశాం: నిర్మలా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పలు రంగాలకు చేయూతనివ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని అయిదు దశల్లో సర్దుబాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒక్కో దశలో ఒక్కో మొత్తాన్ని.. ఆయా రంగాలకు కేటాయించినట్లు చెప్పారు. వాటి వివరాలను ఆమె ఆదివారం నాటి చివరి విడత విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 20,97,053 కోట్ల రూపాయలను చెల్లించామని అన్నారు.
తొలి విడతలో రూ.1,92,800 కోట్లు..
ఈ ఆర్థిక ప్యాకేజీలో తొలి విడతగా 1,92,800 కోట్ల రూపాయల ప్రయోజనాలను కల్పించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుంచి పన్నుల రాయితీల కోసం 7,800 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద 1,70,000 కోట్ల రూపాయలు, హెల్త్కేర్ కోసం 15,000 కోట్లను మంజూరు చేశామని ఆమె తెలిపారు. తొలిదశలో 1,92,800 కోట్ల రూపాయలను ఆయా రూపాల్లో సర్దుబాటు చేసినట్లు చెప్పారు.
రెండో విడతలో రూ.5,94,950 కోట్లు
రెండో విడతలో 5,95,550 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించామని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర వ్యాపార లావాదేవీల కోసం 3,00,000 కోట్ల రూపాయలు, ఎంఎస్ఎంఈలను రుణ విముక్తం చేయడానికి అదనంగా 20,000 కోట్ల రూపాయలు, ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేసిన నిధి కోసం 50 వేల కోట్ల రూపాయలు, చిరు వ్యాపారులు, కార్మికుల ఈపీఎఫ్ కోసం 2,800 కోట్లు, ఈపీఎఫ్ రిడక్షన్ కోసం 6,750 కోట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ల స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ కింద 30 వేల కోట్లు, పాక్షిక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కోసం 45 వేల కోట్లు, డిస్కమ్ల కోసం 90 వేల కోట్లు, టీడీఎస్/టీసీఎస్ రిడక్షన్ కోసం 50 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్లు చెప్పారు.
అదే దశలో రూ.3,10,000 కోట్లు..
అదే దశలోనే 3,10,000 కోట్ల రూపాయలను కేటాయింపులు జరిపినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండు నెలల పాటు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి 3,500 కోట్లు, ముద్ర శిశు పథకం కింద రుణాల కోసం 1,500 కోట్లు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల కోసం స్పెషల్ క్రెడిట్ సౌకర్యం కింద 5000 కోట్లు, హౌసింగ్ కోసం 70 వేల కోట్లు, నాబార్డుకు 30 వేల కోట్లు, కేసీసీలకు అదనపు రుణాల మంజూరు కోసం 2,00,000 కోట్లను మంజూరు చేశామని అన్నారు.
మూడో విడతలో 1,50,000 కోట్లు..
మూడో విడతలో 1,50,000 కోట్ల రూపాయలను వివిధ ప్రాధాన్యతా రంగాలకు కేటాయించామని అన్నారు. ఫుడ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం 10 వేల కోట్లు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కోసం 20 వేల కోట్లు, ఆపరేషన్ గ్రీన్స్ కోసం 500 కోట్లు, వ్యవసాయ ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన నిధి కోసం 1,00,000 కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల కల్పనకు 15,000 కోట్లు, ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించడానికి 4000 కోట్లు, బీకింగ్ ఇనిషియేటివ్ కింద 500 కోట్ల రూపాయలను మంజూరు చేశామని అన్నారు.
Recommended Video
నాలుగు, అయిదో విడతల్లో 48,100 కోట్లు..
నాలుగు, అయిదు విడతల్లో మొత్తం 48,100 కోట్ల రూపాయలను సర్దుబాటు చేశామని వివరించారు నిర్మలా సీతారామన్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కోసం 8,100 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల కోసం 40 వేల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించినట్లు చెప్పారు. వాటన్నింటి ద్వారా మొత్తంగా 20,97,053 కోట్ల రూపాయలను చెల్లించామని ఆమె వివరించారు.