మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్
హిందూత్వ ప్రధానాంశంగా రాజకీయాలు నెరపే బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నక్రమంలోనే ముస్లిం మైనార్టీలకు ప్రతినిధినని చెప్పుకునే ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీకి సైతం ఫాలోవర్లు, డోనార్లు పెరుగుతూ వస్తున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు తమకు లభించిన విరాళాల వివరాలను భారత్ ఎన్నికల సంఘం(ఈసీఐ)కి రిపోర్టులుగా అందజేశాయి. వాటిలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి..
Recommended Video
జగన్ శత్రువే, చంద్రబాబు మోసగాడు-టీడీపీతో కలిస్తే బీజేపీకి అధోగతే -తిరుపతిలో ప్లాన్ 47: దేవధర్ సంచలనం
మజ్లిస్ పార్టీకి భారీగా..
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిలోకి.. విరాళాలు పొందడంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ దూసుకుపోతోంది. జాతీయ, ప్రధాన పార్టీలకు దీటుగా ఎంఐఎంకు జోరుగా విరాళాలు అందుతున్నాయి. ఇటీవలి కాలంలో దేశం నలుమూలల నుంచి ఎంఎంకు విరాళాలిచ్చే దాతల సంఖ్య పెరుగుతోంది. ఈసీకి సమర్పించిన విరాళాల నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. మజ్లిస్ నేతల హెలికాప్టర్ ప్రయాణాలకు కూడా ఖర్చులు భరించేందుకు డోనార్టు ముందుకొస్తున్నారు..
ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా..
ఒకప్పుడు ఒక్క తెలంగాణకే.. అది కూడా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమైపోయిన ఎంఐఎం పార్టీ.. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి క్రమంగా విస్తరిస్తూ వస్తోంది. మజ్లిస్ పార్టీ పేరుకు ప్రాంతీయ పార్టీనే అయినా.. దానిని దేశమంతటా విస్తరించేందుకు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికిని చాటుకున్న ఎంఐఎం.. ఈఏడాది జరగబోయే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. ఇక విరాళాల వివరాలు చూస్తే..
హెలికాప్టర్ రైడ్కు రూ.3లక్షలు..
2019-2020 మధ్య తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు హెలికాప్టర్లలో ప్రయాణించడానికి విరాళాలు అందాయని ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ లో మజ్లిస్ పేర్కొంది. ఒక్కో రైడ్ కు రూ.3 లక్షల చొప్పున.. నాలుగు రైడ్ లకుగానూ రూ.12 లక్షల విరాళాలు అందాయని చెప్పింది. మహ్మద్ నజీబుద్దీన్ ఖాన్, ఇంథిఖాబ్ అన్సారీ, ఝార్ఖండ్ కు చెందిన రియాజ్ షరీఫ్, ముంబైకి చెందిన అలావుద్దీన్ అన్సారీల హెలికాప్టర్ ప్రయాణాలకు విరాళాలు వచ్చాయని తెలిపింది.2019-20ఏడాదిలో ఎంఎంఎంకు ఏకంగా 13.85లక్షల విరాళాలు వచ్చాయి. 2018-19లో ఎన్నికల ఏడాది కావడంతో మజ్లిస్ సహా అన్ని పార్టీలకు విరాళాలు పెరిగిన సంగతి తెలిసిందే. 2018-19లో ఎంఐఎం ఆదాయం మొత్తంగా రూ.1.67కోట్లుకాగా, అందులో రూ.56.93లక్షలు విరాళాలుగా అందాయి. రూ.90.66 లక్షలు వడ్డీలు(ఫిక్సుడు డిపాజిట్లపై) వచ్చాయి. దారూసలాం బోర్డు ఆదాయంలో షేర్, అద్దెల రూపంలో ఇతర మొత్తం సమకూరింది. కాగా..
టీఆర్ఎస్ ఆదాయం, విరాళాలు ఎంత?
ప్రాంతీయ పార్టీల ఆదాయం, విరాళాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘానికి ఇప్పటికే పలు పార్టీలు నివేదికలు పంపగా.. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ను సమర్పించలేదు.టీఆర్ఎస్ పార్టీ విరాళాలు 2017-18లో రూ.3.3 కోట్లు లభించగా... 2018-19లో ఆ పార్టీకి రూ.41.27 కోట్లు విరాళాలుగా వచ్చాయి.గతంలో టీఆర్ఎస్ గులాబీ పనిదినాలు పేరుతో విరివిగా విరాళాలు సేకరించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.