బిహార్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్: మజ్లిస్ వ్యూహాలకు పదును.. !
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ లో కనీసం 20 చోట్ల అభ్యర్థులను నిలబెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకు టికెట్లను ఇవ్వనుంది. జార్ఖండ్ అసెంబ్లీలో ఇప్పటిదాకా మజ్లిస్ పార్టీ బోణీ చేయలేదు. ఆ కొరతను తీర్చుకోవడానికి పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పాతబస్తీకి మాత్రమే పరిమితమైనదనే ముద్రను చెరిపేసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్రలో.. రెండు చోట్ల
మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్థానాలను గెలుచుకోగలింది. మలేగావ్, ధూలే సిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఏడున్నర లక్షలకు పైగా ఓట్లను సాధించిందా పార్టీ. 2014 నాటి ఎన్నికలతో పోల్చి చూస్తే.. అయిదు లక్షల ఓట్లు అధికంగా సంపాదించుకోగలిగింది. దీనితోపాటు బిహార్ లోని కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలోనూ తన సత్తా చాటింది. కిషన్ గంజ్ స్థానంలో విజయం సాధించింది. అధికార జనతాదళ్ (యునైటెడ్) మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి స్వీటీసింగ్ ను ఓడించి మరీ కిషన్ గంజ్ ను గెలుచుకోవడం అసాధారణ విషయమని అంటున్నారు.
అధికార పగ్గాలు బీజేపీ-శివసేన కూటమికే: లేదంటే రాష్ట్రపతి పాలనే.. మేం ప్రతిపక్షంలోనే: శరద్ పవార్..!
బిహార్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించి..
బిహార్ సీమాంచల్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మజ్లిస్ హవా వీస్తోందని చెబుతున్నారు పార్టీ నాయకులు. వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలను గెలుచుకోవడాన్ని భారీ విజయంగానే పరిగణిస్తున్నారు మజ్లిస్ నాయకులు. మలేగావ్ నియోజకవర్గంలో లక్షా 17 వేల పైచిలుకు ఓట్లతో గెలవడం మామూలు విషయం కాదని, ఇదే ఊపును అన్ని ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనీసం అయిదు సీట్లనైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది.
వ్యూహాలకు పదును..
ఇప్పటిదాకా మజ్లిస్ పార్టీ జార్ఖండ్ ఎన్నికల్లో గెలవలేదు. ఈ సారి విజయాన్ని సాధించేలా కసరత్తు సాగిస్తోంది. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్న వారికి పార్టీ టికెట్లను ఇస్తామని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. దీనికోసం పార్టీ అధినేత ఒవైసీ త్వరలోనే జార్ఖండ్ వెళ్లనున్నారని, క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారని అంటున్నారు. త్వరలోనే అసదుద్దీన్ ఒవైసీ రాంచీ వెళ్లనున్నారని, క్షేత్రస్థాయి పర్యటలను నిర్వహిస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నామని, త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.