లైలా కోసం: తాజ్మహల్ను కట్టింది ఒవైసీ ముత్తాతలు: షియా వక్ఫ్బోర్డు ఛైర్మన్ వివాదం
న్యూఢిల్లీ: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సీనియర్ నాయకుడు, చాంద్రాయణ గుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై షియా వక్ఫ్బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వి ఘాటుగా విమర్శలు గుప్పించారు. వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్మహల్ను ఒవైసీ ముత్తాతలే కట్టించారని చెప్పారు. తమ లైలా కోసం వారు తాజ్మహల్ను నిర్మించారని ఎద్దేవా చేశారు.
అక్బరుద్దీన్ ఒవైసీ తాజాగా చేసిన ఓ ప్రకటనను దృష్టిలో ఉంచుకుని వసీం రిజ్వి ఇలా ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 800 సంవత్సరాల కిందటే ముస్లింలు భారతదేశాన్ని పరిపాలించారంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని వసీం రిజ్వీ తపు పట్టారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై అక్బరుద్దీన్ ఒవైసీ రెండు రోజుల కిందట నిప్పులు చెరిగారు.
తన సామాజిక వర్గం 800 సంవత్సరాలు కిందటే ఈ దేశాన్ని పరిపాలించిందని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు. అలాంటి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు.. తాము భారతీయులమని నిరూపించకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లను చూపాలని అడగడం సరి కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఇదివరకే అక్బరుద్దన్పై విమర్శల జడివాన కురిపించారు.
తాజాగా- వసీం రిజ్వీ కూడా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానాలను తప్పుపట్టారు. ఒవైసీ ముత్తాతలే తాజ్మహల్ను కట్టించారని చురకలు అంటించారు. ముస్లిం పరిపాలకులు హిందూ ఆలయాలను పడగొట్టించి.. దాని స్థానంలో తాజ్మహల్ను కట్టారని ఆరోపించారు. దీని గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అదే తరహాలో పవిత్ర మక్కాలోని మసీదును పడగొట్టి హిందూ ఆలయాన్ని కట్టించగలరా? అని సవాల్ విసిరారు.