వయనాడ్లో వాళ్ల వల్లే రాహుల్ గెలిచాడు
కేరళ వయనాడ్లో రాహుల్ గాంధీ గెలుపుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజయానికి ముస్లింలే కారణమని అన్నాడు. వయనాడ్లో 40శాతానికి పైగా ముస్లిం ఓటు బ్యాంకు ఉందని, వారందరి ఓట్లు రాహుల్కు పడినందునే అంత భారీ మెజార్టీ వచ్చిందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. అమేథీలో పరాజయం పాలై వయనాడ్లో రాహుల్ విజయం సాధించేందుకు ముస్లింలే కారణమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీని వ్యతిరేకిస్తున్నారని ఒవైసీ అన్నారు. ఆ కారణంగానే ముస్లింలు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉన్న కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని చెప్పారు. అబుల్ కలాం ఆజాద్, మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్ లాంటి సమరయోధులతో పాటు కోట్లాది మంది అనుచరుల వల్ల స్వాతంత్ర్యం సిద్ధించిందని అసద్ చెప్పారు. దేశంలో ముస్లింలు కూడా భాగస్వాములేనని, తాము ఎవరి భిక్ష కోరుకోవడం లేదని అన్నారు.
తాజా సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే అమేథీలో ఆయన ఓటమి పాలు కాగా.. వయనాడ్లో 4,31,063 ఓట్లతో ఘన విజయం సాధించారు.