అయోధ్యలో మసీదుపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. అలాంటి మసీద్ లో నమాజ్ కూడా వద్దు
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, రిపబ్లిక్ డే రోజున అయోధ్యలో మసీదు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు ముస్లిం మత పెద్దలు. రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలందరికీ కదిలించేలా నిధుల సేకరణ జరుగుతుండగా, మసీదు నిర్మాణానికి కూడా చందాలను స్వీకరిస్తున్నట్లుగా ట్రస్టు సభ్యుడు అధర్ హుస్సేన్ చేసిన ప్రకటనపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రిపబ్లిక్ డే రోజు .. జాతీయజెండా ఎగురవేసి అయోధ్యలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం
అయోధ్య మసీదు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధమన్న ఓవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు చందా ఇవ్వడం తప్పని, అలా చందాలతో నిర్మించిన మసీదులలో నమాజ్ కూడా చేయకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి అధర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన అసదుద్దీన్ ఓవైసీ బీదర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య మసీదు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధమని, ప్రజలు దాని నిర్మాణానికి విరాళాలను ఇవ్వద్దని, ప్రార్థనలు చేయొద్దని పేర్కొన్నారు.
అది మసీదు కాదు, అక్కడ ప్రార్ధనలు చెయ్యకూడదు
మత పెద్దల నుండి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నానని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నుండి ఉలేమా కూడా దీనిని మసీద్ అని పిలవకూడదని చెప్పారని, అక్కడ ప్రార్థనలు చెయ్యకూడదని , ఇది ఇస్లామిక్ విధానాలకు వ్యతిరేకంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. సర్వశక్తివంతుడైన అల్లాకు నమాజ్ సమర్పించబడే చోటు విరాళాలతో నిర్మించకూడదు అని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి రిపబ్లిక్ డే నాడు శ్రీకారం
ఇక ముస్లింలంతా ఏకమైతే 70 ఏళ్లుగా రాజకీయ లబ్ది పొందుతున్న వాళ్లను కూల్చగలమని వ్యాఖ్యానించిన ఓవైసీ, ఎన్నికల్లో దళితులపై ఏ ముస్లిం పోటీ చేయకూడదని సూచనలు చేశారు.
భారతదేశ 72 వ గణతంత్ర దినోత్సవం నాడే అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో ఆలయం, అదే జిల్లాలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించి 2019 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దీనిని నిర్మించనున్నారు. ఐదు ఎకరాల స్థలంలో నిర్మించనున్న మసీదు కోసం విరాళాలకై మేము విజ్ఞప్తి చేశామని , ప్రజలు ఇప్పటికే సహకారం అందించడం ప్రారంభించారని ట్రస్ట్ స్పష్టం చేసింది . దీంతో ఓవైసీ అలా చెయ్యటం తప్పని సంచలన వ్యాఖ్యలు చేశారు .