రజినీకాంత్ పై ఓవైసీ ఫైర్ : మరో మహాభారత యుద్ధం కోరుకుంటున్నారా..?
హైదరాబాదు: ఇప్పటి వరకు ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఛాన్స్ దొరికితే తన ప్రశ్నలతో ఇరుకున పెట్టే మజ్లిస్ అధినేత ఓవైసీ... ఈ సారి తన గన్ను సూపర్స్టార్ రజనీకాంత్ వైపు ఎక్కుపెట్టారు. ఈ మధ్యే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ రద్దు చేస్తూ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన నిర్ణయం వెనుక ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కొనియాడుతూ వారిని కృష్ణార్జునులుగా అభివర్ణించారు సూపర్ స్టార్ రజనీకాంత్. దీంతో రజనీకాంత్కు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. అయితే రజనీకాంత్ పేరును ప్రస్తావించకుండానే మనదేశంలో మరో మహాభారతంను ఆయన కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు ఓవైసీ. మోడీ అమిత్షాలు కృష్ణా, అర్జునులైతే... మరి పాండవులు కౌరవులు ఎవరు అని రజనీకాంత్ను ప్రశ్నించారు ఓవైసీ.
కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభినందించే ముందు రజనీకాంత్ ఒక్కసారి మహాభారతంను చదివి ఉంటే బాగుండును అని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఓవైసీ కూడా ప్రశ్నించడం ఆసక్తిరేపింది. ఆర్టికల్ 370 రద్దును కొనియాడుతూ రజనీకాంత్ ప్రశంసించడం తనను విస్మయానికి గురిచేసిందని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ మిషన్ కశ్మీర్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను అమిత్ షాను తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఈ చారిత్రాత్మక అడుగు వేయడంపై మోడీ అమిత్ షాలలో ఎవరు కృష్ణుడో ఎవరు అర్జునుడో అన్న విషయం వారికే తెలుసని అన్నారు తలైవా.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం ఆగష్టు 5న తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్తో పాటు ఇతర విపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్తో పాటు బిల్లును వ్యతిరేకించిన వారిలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీలు ఉన్నాయి.మరో వైపు టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, అన్నాడీఎంకే పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపడంతోనే బిల్లు రాజ్యసభలో సులభంగా పాస్ అయ్యిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.