ఆరోగ్యసేతు యాప్ ఎంతో ప్రమాదకరం..! అసదుద్దీన్ ఓవైసీ మరో సంచలన ప్రకటన..!!
హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశ ప్రజల ప్రాణాలకు పెద్ద పీట వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తున్నాయి. కనిపించని కరోనా వైరస్ ఎవరి మీద ప్రభావం చూపిందో టెస్టులు చేస్తే గాని నిర్దారించలేం. అలాంటిది 130కోట్ల భారత దేశ పౌరుల ఆరోగ్యం, క్షేమ సమాచారం తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం వినూత్న యాప్ ను అమలులోకి తెచ్చింది.
ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో ప్రజల ఆరోగ్యానికి సంబందించిన అంశాలను పొందుపరిస్తే వ్యాధి గ్రస్తుడా కాదా అనే అంశం తెలిసిపోంతుందన్నది కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా విపరీతంగా జనాదరణ పొందుతున్న ఆరోగ్య సేతు మొబైల్ యాప్పై రాజకీయ దుమారం రాజుకుంటోంది. ఇదే యాప్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్య సేతు యాప్ ఒక పనికి మాలిన యాప్ అని అభివర్ణించారు. ఈ యాప్ వినియోగించే వారి డేటా నిరర్ధకంగా మారే ప్రమాదం కనిపిస్తోందని ఓవైసీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న కరోనా వైరస్ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్తోను ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని అసదుద్దీన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే అసదుద్దీన్ నేరుగా ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ప్రభుత్వం పేరును ప్రస్తావించకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ సుల్తానులుగా అభివర్ణించడం విశేషం. ఆరోగ్యశ్రీ సేతు యాప్ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని, అది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని ఓవైసీ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే ట్వీట్ పై వాడివూవేడి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.