'మిడిల్ క్లాస్'కు ఊహించని దెబ్బ: ఆ ప్రతిపాదనలు అమలైతే సంక్షేమం కట్?
ద్విచక్ర వాహనం, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, నాలుగు గదుల ఇల్లు ఉన్నవారికి ఇకనుంచి సంక్షేమ పథకాలను వర్తింపజేయవద్దని సూచించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మధ్య తరగతి జీవుల సంక్షేమం నుంచి పక్కకు తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుబోతుండటమే ఇందుకు కారణం.
పట్టణాలు, నగరాల్లో నివాసముండే కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసే విషయంలో కొత్త నిబంధనలను త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ మేరకు బిబేక్ దెబ్రాయ్ కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇందులో భాగంగా.. ద్విచక్ర వాహనం, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, నాలుగు గదుల ఇల్లు ఉన్నవారికి ఇకనుంచి సంక్షేమ పథకాలను వర్తింపజేయవద్దని సూచించింది.
అయితే ఈ ప్రతిపాదనలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈరోజుల్లో చాలావరకు మధ్య తరగతి కుటుంబాల్లో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ద్విచక్ర వాహనం అనేవి కామన్ అయిపోయాయి. వీటిని సాకుగా చూపి సంక్షేమం నుంచి తప్పించుకోవాలని చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో పట్టణ ప్రాంతాల్లోని 59శాతం మందికి సంక్షేమ పథకాలు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దెబ్రాయ్ నివేదిక ప్రకారం..పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులుగా తేల్చారు.