Chandrayaan 2: విక్రమ్ ల్యాండర్ శకలాల గుర్తింపుపై నాసా ప్రకటనను తోసిపుచ్చిన ఇస్రో ఛైర్మన్ శివన్.. !
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మంగా ప్రయోగించిన ప్రాజెక్టు చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్ ల్యాండర్ శకలాలను కనుగొనడంపై సంస్థ ఛైర్మన్ కే శివన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా కంటే ముందే తామే విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించినట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ముక్కలుగా పడి ఉన్నట్లు నాసా వెల్లడించిన 24 గంటల వ్యవధిలోనే శివన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
షాకింగ్: ల్యారీపేజ్: అవుట్.. సుందర్ పిచాయ్కు ప్రమోషన్.. గందరగోళంలో గూగుల్ ఆల్ఫాబేట్!
Recommended Video
తొలుత విఫలమైన నాసా..
తొలుత- నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) దీన్ని గుర్తించినట్లు తేలింది. జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ జాడను గుర్తించడానికి నాసా తన ఆర్బిటర్ ద్వారా రెండుసార్లు ప్రయత్నించింది. ఈ రెండు సార్లు కూడా లూనార్ ఆర్బిటర్ లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరాల ద్వారా విక్రమ్ ల్యాండర్ దిగి ఉండొచ్చనే ప్రదేశాన్ని జల్లెడ పట్టింది. మైక్రో స్థాయిలో ఫొటోలను తీసింది. అయినప్పటికీ.. ల్యాండర్ జాడను కనుగొనలేకపోయింది.
గుర్తించడంలో సహకరించిన చెన్నై యువకుడు..
నాసా లూనార్ ఆర్బిటర్ తీసిన ఫొటోలను చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ విశ్లేషించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగే సమయంలో క్రాష్ ల్యాండింగ్ కు గురైందని నిర్ధారించారు. దీనికి సంబంధించిన శకలాలు ఫలానా చోట ఉన్నట్లు గుర్తిస్తూ నాసాకు లేఖ రాశారు. దీన్ని నాసా ధృవీకరించింది. దీనితో- తామే మొదటగా విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించినట్లు ప్రకటించుకున్నారు నాసా శాస్త్రవేత్తలు.
అనుమానం ఉన్నవాళ్లు చదువుకోవచ్చు..
ఈ ప్రకటనను ఇస్రో ఛైర్మన్ కే శివన్ తోసి పుచ్చుతున్నారు. విక్రమ్ ల్యాండర్ శకలాలను తామే మొదటగా గుర్తించామని వెల్లడించారు. ఈ విషయంలో నాసా చేసిన ప్రకటనను ఆయన పరోక్షంగా తప్పుపట్టారు. విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించిన విషయాన్ని తాము ఇదివరకే తమ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచామని, అనుమానం ఉన్న వాళ్లు కావాలనుకుంటే వెళ్లి చదువుకోవచ్చని శివన్ స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 8న శివన్ చేసిన ప్రకటన ఇదీ..
విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవం వైపు ల్యాండ్ అవుతూ బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు కోల్పోయిన మరుసటి రోజే.. శివన్ ఓ ప్రకటన చేశారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదికి దిగిందని, దాని పరిస్థితి ఎలా ఉందో తెలియరావట్లేదంటూ సెప్టెంబర్ 8వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ ముక్కలైనట్టుగా నిర్ధారించలేదు. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి ఉంటుందని, ల్యాండర్ తో సంధానం పొందడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన తాజాగా గుర్తు చేశారు.