కోవిడ్ పోరులో గంజాం జిల్లా సర్పంచుల పనితీరు భేష్..కొనియాడిన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ
న్యూఢిల్లీ: ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా కరోనావైరస్ పై పోరాడిన తీరును ప్రశంసించింది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ. కోవిడ్-19 పై జిల్లా సర్పంచులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహమ్మారి పై విజయం సాధించారన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ కొనియాడింది. ఇక దేశ చరిత్రలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ల నుంచి సర్పంచుల చేతికి అధికారం బదిలీ అయ్యింది. కోవిడ్-19పై పోరుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తొలిసారిగా సర్పంచులకు అన్ని అధికారాలను కట్టబెట్టారు. నవీన్ పట్నాయక్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైరస్ ప్రబల కుండా చాలావరకు కట్టడి చేయగలిగారు.
కోవిడ్ -19 పోరు కోసం కలెక్టర్ల నుంచి సర్పంచులకు అధికారాలను బదిలీ చేసిన నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి.దేశంలోని 310 నగరాలపై పరిశోధనలు చేసిన తర్వాత ఒడిషాలోని గంజాం జిల్లా కోవిడ్-19 పై వ్యవహరించిన తీరుతో మంచి విజయం సాధించిందని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పేర్కొంది. గంజాం జిల్లాలో తొలి కేసు మే 2వ తేదీన నమోదు కాగా.. ఆగష్టు నెలనాటికి 59శాతం కేసులు నమోదయ్యాయి. ఆ వెంటనే నివారణ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆక్స్ఫర్డ్ స్టడీ పేర్కొంది. ప్రస్తుతం 20430 మంది కరోనా పేషెంట్లలో 98శాతం మందికి చికిత్స అందివ్వడం జరిగిందని మరో 188 మందికి మాత్రమే కరోనా ఉందని ఆక్స్ ఫర్డ్ స్టడీ పేర్కొంది.
ఇక సర్పంచులు సమయానికి స్పందించి ప్రతి గ్రామంలో కోవిడ్-19 మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ వెళ్లి ఆరుసార్లు స్క్రీనింగ్ చేయడం జరిగిందని స్టడీ తెలిపింది. వెయ్యికి పైగా వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారని వెల్లడించింది. ప్రతి ఐదు గ్రామాలకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పేర్కొంది. గంజాంతో పాటు ముంబైలోని ధారవిని కూడా ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రస్తావించింది.
Recommended Video
కరోనా కట్టడికి చిన్న గ్రామాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తూ ఒడిషాలోని గంజాం, మహారాష్ట్రలోని ధారావిల పేర్లను ప్రస్తావించింది. కొన్ని వేల మందికి ఇక్కడ కరోనా సోకగా వీరు అవలంబించిన విధానంతో నేడు 200 మంది కంటే తక్కువగా కరోనా పేషెంట్లు ఉన్నారని ఆక్స్ఫర్డ్ వెల్లడించింది.