సర్కార్ తప్పుడు నిర్ణయాలతోనే ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం.. ప్రధాని మౌనం ఎందుకు? చిదంబరం ఫైర్
తీహార్ జైలు నుంచి విడుదలైన మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంక్షోభంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు, అనాలోచితమైన, మూర్ఖమైన, దారుణమైన తప్పులు, నిర్ణయాల వల్లే ఇదంతా జరుగుతుందని ఆయన విమర్శించారు. ఆ ప్రభావమే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైందని ఆయన ఆరోపించారు. గురువారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
ఉల్లిగడ్డ తినావా? ఆ పండు తింటుందా? నిర్మలా సీతారామన్పై చిదంబరం సెటైర్
ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన 7 నెలలలో ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన సమస్యలను బీజేపీ ప్రభుత్వం చాలా సాధారణమైన అంశంగా భావిస్తున్నది. ఎప్పటిలానే పునరావృతమయ్యే సమస్యగా బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పుగా ఉన్నాయి. తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై దృష్టి పెట్టడం లేదు. సమస్యలకు సరైన పరిష్కారం వెతకడం లేదు అని చిదంబరం మండిపడ్డారు.
పీఎంవో మూర్ఖమైన విధానాలు
ప్రధాన మంత్రి కార్యాలయంలో తీసుకొంటున్న అస్తవ్యస్త నిర్ణయాల ప్రభావమే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ క్షీణతకు కారణం. నోట్లరద్దు, అనేక లోపాలు జీఎస్టీ లాంటి అంశాలపై మొండిగా, మూర్ఖంగా, దారుణమైన నిర్ణయాలు తీసుకొన్నది. అలాంటి నిర్ణయాలే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి అని చిదంబరం పేర్కొన్నారు.
దారుణంగా జీడీపీ
స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ఆరు త్రైమాసికాల కనిష్ట స్థాయికి చేరుకోవడంపై చిదంబరం స్పందించారు. ప్రభుత్వం ఓ సత్తాలేని మేనేజర్గా మారిందని ఘాటైన కామెంట్లు చేశారు. ఆర్థిక వ్యవస్థ దారుణమైన పరిస్థితిలో ఉన్నా ప్రధాని మోదీ మౌనం వహించడం, ఓ ప్రకటన చేయకపోవడాన్ని చిదంబరం తప్పుపట్టారు. మంత్రులతో అవాస్తవాలు చెప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ 8 శాతం నుంచి 4.5 శాతానికి దిగజారడం బీజేపీ ‘అచ్చేదిన్'కు సంకేతమా? అని చిదంబరం వ్యాగ్యాస్త్రాలను విసిరారు.
విదేశీ ఆర్థిక సంస్థలు చూపు
భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలను అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పలు సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఐఐపీ, మ్యానుఫక్చరింగ్, కోర్ సెక్టార్ల గణాంకాలు కనిష్టస్థాయికి చేరుకొన్నాయని ఆయన చెప్పారు.