చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. వచ్చే గురువారం(సెప్టెంబర్ 5) వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే, చిదంబరంను జైలుకు మాత్రం తరలించరాదని స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు కొనసాగాయి.
కాగా, చిదంబరం వయస్సు ఇప్పుడు 74ఏళ్లు అని, అందుకే అతడ్ని తీహార్ జైలుకు తరలించవద్దని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అతడ్ని అరెస్ట్ చేయకుండా ఇంటిలోనే నిర్బంధించి విచారించవచ్చని సుప్రీంకోర్టును కపిల్ సిబల్ కోరారు.
చిదంబరంను ఎక్కడ విచారించాలన్న విషయాన్ని సీబీఐ కోర్టు తేలుస్తుందని సీబీఐ వాదనలు వినిపించింది. చిదంబరం లాంటి వ్యక్తులను తమ ఆధీనంలో విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ వాదించింది. దీంతో సుప్రీంకోర్టు గురువారం వరకు చిదంబరం కస్టడీని పొడిగించింది.
ఇంతకుముందు కోర్టులో కపిల్ సిబల్ వాదిస్తూ సీబీఐ, ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించిన ప్రశ్నలను రాతపూర్వకంగా సమర్పించాలని ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్న ఈ వాదనలు విన్నారు. చిదంబరంను విచారిస్తున్న ఈడీ.. ఎలాంటి డాక్యుమెంట్లను కోర్టులో సమర్పించడం లేదని, కస్టడీకి మాద్రం అడుగుతోందని చిదంబరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు. అంతేగాక, విచారణ సందర్భంగా కేసుకు సంబంధం లేని, అనవసర ప్రశ్నలు వేస్తున్నారని ఆయన తెలిపారు.